Italy : ఇటలీలో 70 ఏళ్లలో లేనంత నీటి కొరత..ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
ఇటలీలో 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత నీటి కరువు ఏర్పడింది. దీంతో ప్రభుత్వం ఎమర్జన్సీ ప్రకటించింది.
Italy : ఇటలీలో 70 ఏళ్లలో ఎన్నడూ లేనంత నీటి కరువు ఏర్పడింది. ఇటలీలోని ఐదు ఉత్తర ప్రాంతాలైన ఎమిలియా రోమగ్న, ఫ్రూలీ వెంజియా గులియా, లొంబార్డీ, పీడమాంట్, వెనిటోల్లో ప్రత్యేక ఎమర్జెన్సీ నిధుల ప్యాకేజీ ప్రకటించారు. జూలై 4న మంత్రుల మండలి ద్వారా €36.5 మిలియన్లు కేటాయించబడ్డాయి. నీటి కరవుతో ఇటలీలోని అతి పొడవైన ‘పో’ నది చుట్టు ఉన్న ప్రాంతాలు బీడు భూములుగా మారుతున్నాయి.ఈ నీటి కొరతత వలన ఇటలీ వ్యవసాయ ఉత్పత్తుల్లో 30 శాతం దిగుబడి తగ్గనుంది.
ఈ ప్రాంతంలోని అనేక మున్సిపాల్టీల్లో నీటి వినియోగంపై ఆంక్షలు విధించారు. ఊహించని రీతిలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ స్థాయిలో వర్షం నమోదు కావడం వల్ల ఉత్తర ఇటలీలో నీటి ఎద్దడి ఏర్పడింది. ఇటలీలో పో నది అత్యంత పొడువైనది. తూర్పు దిశగా సుమారు 650 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. నదిలోకి ఉప్పు నీరు ప్రవహిస్తోందని, దీంతో పో నది పరివాహాక ప్రాంతంలో ఉన్న పంటలు నాశనం అవుతున్నట్లు రైతులు వాపోతున్నారు.
పో నది చుట్టూ సారవంతమైన మైదానాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో నాలుగు నెలలుగా చుక్క వాన పడటంలేదు. దీంతో దేశంలో 40 శాతం ఆహారోత్పత్తులు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో బియ్యం, గోధుమలు ఉన్నాయి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో 50 శాతం పశువులు నీటి కరవుతో అల్లాడుతున్నాయి.
ఇటలీలోని మరో ప్రసిద్ధ నగరమైన రోమ్లోని టైబర్ నది కూడా మట్టం తగ్గింది. లేక్స్ గార్డా, మగ్గియోర్లలో కూడా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రెండూ వాటి సాధారణ స్థాయి కంటే చాలా తక్కువగా ఉన్నాయి. దేశంలోని జలవిద్యుత్ ఉత్పత్తికి నీటి కొరత కూడా ఒక సమస్యగా మారింది. ఇటలీ శక్తిలో 20 శాతం ఉత్పత్తి చేసే చాలా సంస్థాపనలు ఉత్తరాన ఉన్న పర్వత ప్రాంతాలలో ఉన్నాయి. ఫలితంగా జలవిద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.