పాకిస్తాన్ లో హిందువుల ఇళ్లు కూల్చివేత

  • Published By: venkaiahnaidu ,Published On : May 22, 2020 / 04:17 PM IST
పాకిస్తాన్ లో హిందువుల ఇళ్లు కూల్చివేత

కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా ప్రపంచదేశాలన్నీ ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని సూచిస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ మాత్రం తమ దేశంలోని హిందువుల ఇళ్లు కూలగొట్టి వాళ్లను రోడ్లపై పడేసే పనిలో బిజీగా ఉంది. మైనారిటీలపై వివ‌క్ష చూపుతూ పాకిస్తాన్ సాగిస్తున్న ఆగ‌డాలు నానాటికీ మితిమీరిపోతున్నాయి. ఇది ఆ దేశ మంత్రి ఆధ్వ‌ర్యంలోనే జ‌ర‌గ‌డం ఇప్పుడు గ‌మ‌నార్హం. 

పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని భ‌వ‌ల్పూర్‌లోని మైనారిటీ హిందూ కమ్యూనిటీ నివసించే ఓ బస్తీలోని నివాసాల‌ను బుల్డోజ‌ర్ల‌తో నేల‌మ‌ట్టం చేశారు. ఇమ్రాన్ కేబినెట్ లో గృహనిర్మాణ మంత్రిగా ఉన్న త‌రీఖ్ బ‌షీర్‌ చీమా పర్యవేక్షణలోనే హిందువుల ఇళ్లు కూల్చివేత జరిగింది. నిలువ‌నీడ లేకుండా చేయ‌కండంటూ బాధితులు  రోదిస్తూ అధికారుల కాళ్లావేళ్లా ప‌డ్డా ఒక్క‌రూ ప‌ట్టించుకోకుండా వాళ్ల ఇళ్లను కూల్చివేశారు.

క‌ళ్ల ముందు ఇల్లు కూలిపోతూ శిథిలాల దిబ్బ‌గా మారుతుంటే హిందువులు గుండెలు ప‌గిలేలా రోదించారు. ఈ ఘ‌ట‌న‌లో వంద‌లాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

కాగా మైనారిటీ హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నారంటూ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కొద్ది రోజుల‌కే ఈ దారుణానికి పాల్ప‌డింది. ఇటీల ఇదే త‌ర‌హా ఘ‌ట‌న వెలుగు చూసిన విష‌యం తెలిసిందే. పంజాబ్ ప్రావిన్స్‌లోని ఖ‌నేవాల్‌లో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌కు చెందిన ఓ రాజకీయ నాయ‌కుడు క్రైస్త‌వుల‌కు చెందిన ఇళ్లు, స్మశానాన్ని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.