Seema -Sachin Love Story : సీమాహైదర్‌ను పాక్ తిరిగి పంపిస్తారా? యూపీ సీఎం యోగి ఏమన్నారంటే…

పాక్ మహిళ సీమాహైదర్-సచిన్ మీనాల ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పాకిస్థానీ బాభీ సీమాహైదర్‌ను తిరిగి పంపిస్తారా? అంటే ఆమె గురించి భద్రతా సంస్థలు సవివరమైన నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు....

Seema -Sachin Love Story : సీమాహైదర్‌ను పాక్ తిరిగి పంపిస్తారా? యూపీ సీఎం యోగి ఏమన్నారంటే…

Seema -Sachin Love Story

Seema Haider-Sachin Meena Love Story : పాక్ మహిళ సీమాహైదర్-సచిన్ మీనాల ప్రేమ కథ రోజుకో మలుపు తిరుగుతోంది. పాకిస్థానీ బాభీ సీమాహైదర్‌ను తిరిగి పంపిస్తారా? అంటే ఆమె గురించి భద్రతా సంస్థలు సవివరమైన నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. (UP CM Yogi Adityanath)

భద్రతా సంస్థల నివేదికపై నిర్ణయం తీసుకుంటాం : సీఎం యోగి

పబ్ జి ఆట ద్వారా ఏర్పడిన పరిచయంతో పాకిస్థాన్ నుంచి వచ్చిన సీమా హైదర్ (Pakistani Bhabhi Seema Haider) తన నలుగురు పిల్లలతో వచ్చి భారత యువకుడు సచిన్ మీనాను పెళ్లాడి యూపీ పరిధిలోని గ్రేటర్ నోయిడాలో నివాసముంటోంది. (Seema Haider-Sachin Meena Love Story) సీమా-సచిన్ ల ప్రేమ పెళ్లి కథ రివర్స్ లవ్ జిహాద్ అనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో దీనిపై సీఎం యోగి స్పందించారు. (Sent Back To Pakistan) పాక్ మహిళ భారత యువకుడిని పెళ్లాడి ఇక్కడే ఉంటున్న ఘటన రెండు దేశాలకు సంబంధించిందని, సీమా హైదర్ గురించి భద్రతా సంస్థలు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నాయని, వారి నివేదిక ఆధారంగానే ఆమెను తిరిగి పాకిస్థాన్ పంపించాలా? లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని సీఎం యోగి పేర్కొన్నారు.

వార్తల్లో నిలచిన పాకిస్థాన్ బాభీ

సీమా హైదర్, సచిన్ మీనాను జులై 4వతేదీన భారతదేశంలో అక్రమంగా ప్రవేశించినందుకు పోలీసు అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల తర్వాత స్థానిక కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి పాకిస్తానీ బాభి సీమా వార్తల్లో నిలిచారు. తాను పాకిస్తానీ గూఢచారి అనే వాదనలను తోసిపుచ్చుతూ సీమా హైదర్ పలు టీవీ న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కాగా తాను టెర్రరిస్టును కాదని, తాను సాధారణ మహిళనని సీమా స్పష్టం చేశారు.

పాక్ తిరిగి వెళ్లడం ఇష్టం లేదు…

తాను ఎప్పటికీ భారత్‌లోనే జీవించాలనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు. తాను తిరిగి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇష్టం లేదని కూడా ఆమె పేర్కొంది. సీమా బాగోతంపై యూపీ ఏటీఎస్, స్థానిక పోలీసులు, ఇతర గూఢచార సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. తనకు భారత పౌరసత్వం ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముందు సీమా పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాను ఇప్పుడు భారతదేశానికి కోడలినని అని ఆమె పేర్కొంటూ భారతదేశంలో ఉండటానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు.

హిందూ మతం స్వీకరించా : సీమా హైదర్

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను హిందూ మతాన్ని స్వీకరించానని, భారతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని కూడా సీమా పేర్కొంది.

సీమా హైదర్ పాకిస్థాన్ గూఢచారా?

భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ కు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ తో సంబంధాలపై భద్రతా సంస్థలు విచారణ జరుపుతున్నాయి. సీమా హైదర్‌పై ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యుపి-ఎటిఎస్) మరియు కేంద్ర ఏజెన్సీలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి. సీమా బాగోతంపై సశాస్త్ర సీమా బల్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల నుంచి నివేదిక కోరింది.