పరీక్షలు లేకుండానే యూజీ, పీజీ విద్యార్థులు పాస్! 

  • Published By: srihari ,Published On : June 22, 2020 / 04:06 PM IST
పరీక్షలు లేకుండానే యూజీ, పీజీ విద్యార్థులు పాస్! 

కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగాల కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగదని HCU వీసీ ప్రొ.పొదిలె అప్పారావు స్పష్టం చేశారు. 

విద్యార్థులకు ఇచ్చిన మొత్తం మార్కుల్లో 50 శాతానికి గత సెమిస్టర్లలోని మార్కుల ఆధారంగా సగటు తీసినట్టు తెలిపారు. మిగిలిన 50 శాతానికి ఇంటర్నల్ పరీక్షలకు కేటాయించారు. అప్పటికే కేటాయించిన మార్కుల సగటు తీసి అందించినట్టు ఆయన చెప్పారు. గత సెమిస్టర్లు, ఇంటర్నల్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి గ్రేడ్లు దక్కాయని అంటున్నారు విద్యార్థులు. HCU ఎంట్రన్స్ టెస్టు ప్రతి ఏడాది మే నెలలో జరగాల్సి ఉంది.

కరోనా కారణంగా పరీక్షను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది యూనివర్శిటీ. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసి విద్యా సంస్థలు తెరుచుకుంటే పరీక్ష జరిగే వీలుండేది. కానీ, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని ఎంట్రన్స టెస్టు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జులైలో పరిస్థితులు మెరుగవకపోతే ఆగస్టు మొదటివారంలో ప్రవేశ పరీక్ష జరిగే పరిస్థితుల్లేవు. బ్యాక్ లాక్ విద్యార్థుల విషయంలో అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరి అభ్యర్థనలపై చర్చించేందుకు పరీక్షల విభాగం అధికారులు, విద్యార్థి సంఘం నేతలతో త్వరలో సమావేశం కానుంది.