రూ.లక్ష శాలరీ.. భారీగా జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వం

రూ.లక్ష శాలరీ.. భారీగా జీతాలు పెంచిన జగన్ ప్రభుత్వం

ap government hike doctors salaries: వేతన సవరణ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న డాక్టర్ల కల నెరవేరింది. బోధనాస్పత్రులు, వైద్య, డెంటల్‌ కళాశాలల్లో పనిచేసే బోధనా వైద్యులకు వేతన సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి వేతన సవరణ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. దీనివల్ల సుమారు 4వేల మంది డాక్టర్లకు లబ్ధి చేకూరుతుంది.

2006లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వేతన సవరణ ఇచ్చారు. ఆ తర్వాత 2016లో తిరిగి వేతనాలు సవరించాల్సి ఉండగా జరగలేదు. 2019లో వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించగా.. ప్రభుత్వ డాక్టర్లు తమ వేతనాల గురించి విన్నవించారు.

ఇంతలోనే 2020 ఫిబ్రవరి నుంచి కోవిడ్‌-19 కారణంగా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా వైద్యులకు న్యాయబద్ధంగా అందాల్సిన వేతన ఫలాలు అందించాలనే ఉద్దేశంతో వారికి 2021 మార్చి 1 నుంచి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ నిర్ణయంతో ట్యూటర్‌ నుంచి ప్రొఫెసర్‌ వరకు పని చేస్తున్న 4 వేల మందికి భారీగా వేతనాలు పెరగనున్నాయి. ఉదాహరణకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.68,900 బేసిక్‌గా నిర్ణయించారు. అలవెన్సులు అంటే టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ అన్నీ కలిపితే రూ.లక్ష వరకూ వేతనం అందనుంది. అన్ని పోస్టుల విషయంలోనూ ఇదేవిధంగా ఉంటుంది.

రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు, 2 డెంటల్‌ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో ట్యూటర్‌ నుంచి ప్రొఫెసర్‌ వరకూ 4 వేల మంది పని చేస్తున్నారు. వీరందరికీ వేతన సవరణ వల్ల భారీగా వేతనాలు పెరగనున్నాయి. 7వ సెంట్రల్‌ పే కమిషన్‌ ఫార్ములా ప్రకారం వేతనాలను పెంచినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అకడమిక్‌ లెవెల్, సీనియార్టీని బట్టి వేతనాల పెంపు నిర్ణయించినట్టు తెలిపారు.