Engineers Day 2021: ఇంజనీర్లకు ఆదర్శం..నీటి ప్రాజెక్టుల రూపశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య
సెప్టెంబర్ 15. ఇంజనీర్స్ డే. భావితరాలను ఆదర్శంగా నిలిచిన ఇంజనీరు, సునిశిత మేధావి, పండితుడు, రాజనీతిజ్ఞుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం.
engineers day 2021 Special Story : సెప్టెంబర్ 15. తాగు,సాని నీటి ప్రాజెక్టుల రూపశిల్పి మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం. ఇంజనీర్లకే కాదు భావితరాలకే ఆయన ఆదర్శనీయుడు. 100 ఏళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన హైదరాబాద్ లోని డ్రైనేజీ వ్యవస్థ నేటికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలివికి నిదర్శనంగా నిలుస్తోంది.తాగు సాగునీటి కష్టాలకు మోక్షాన్ని ఇచ్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విశ్వేశ్వరయ్య భారత ఇంజనీర్గా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన తెలివితేటలకు నిదర్శనంగా ఆనాడు నిర్మించిన ప్రాజెక్టులు ఈనాటికి సేవలందిస్తున్నాయి.
ప్రాజెక్టులను చూసి అది ఎంత నాణ్యమైనదో..దాని పరిస్థితి ఎలా ఉందో చెప్పేస్తారాయన. అలా ఆయన అప్రమత్తత వల్లే ఓ రైలు ప్రమాదం జరగకుండా ఆపింది అంటే ఆయన ప్రాజెక్టుల మీద ఉన్న పట్టు ఎంతో అర్థం చేసుకోవచ్చు. ‘‘ఇంకొద్ది క్షణాల్లో ఈ వంతెన కూలిపోబోతోంది..దయచేసి రైలును ఆపండి అంటూ కేకలు వేసి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సునిశిత మేధావి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన కేవలం ఇంజనీరు మాత్రమే కాదు పండితుడు, రాజనీతిజ్ఞుడు. మైసూరు సంస్థానానికి 1912 నుండి 1918 దివానుగా పనిచేసిన వ్యక్తి.
1961 సెప్టెంబర్ 15న బెంగుళూరులో జరిగిన విశ్వేశ్వరయ్య శతాబ్ది వేడుకల్లో అప్పటి ప్రధాని నెహ్రూ చేత ప్రశంసలు పొందిన అపర భగీరథుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆ మహోన్నత ఇంజనీర్ గురించి నెహ్రూ మాట్లాడుతూ..‘‘మేం మాటలతో కాలయాపన చేశాం..కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిరంతర క్రియాశూరులుగా.. నవభారత నిర్మాణా నికి కృషి చేసిన మహనీయులు’’అంటూ ప్రశంసించారు.
Read more : హైదరాబాద్ లో వరద బీభత్సం, 24 గంటల్లో 30 మంది మృతి
విశ్వేశ్వరయ్య పుట్టుపూర్వోత్తరాలు..
మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు ఏపీలోని ప్రకాశం జిల్లా బేస్తవారపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందినవారు. శ్రీనివాసశాస్ర్తి, వెంకటలక్ష్మమ్మలకు 1861 సెప్టెంబర్ 15న విశ్వేశ్వరయ్య జన్మించాడు. తల్లిదండ్రులు మోక్షగుండం గ్రామం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా చిక్బల్లాపూర్ సమీపంలోని ముద్దనహళ్లికి వెళ్లి స్థిరపడ్డారు. ఆయన ప్రాథమిక చిక్బల్లాపూర్ జరిగింది. విశ్వేశ్వరయ్య 15వ ఏళ్లలోనే తండ్రిని కోల్పోయారు. ఆతరువాత విశ్వేశ్వరయ్య మేనమామ రామయ్యే ఆయన్ని చదివించారు. విశ్వేశ్వరయ్యలో ఉన్న తెలివితేటల్ని గుర్తించిన మేనమామ బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో చేర్పించారు. 1880లో ఎం.ఎలో ఆయన ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.
లెక్కలు అంటే ఆయనకు ప్రాణం. మైసూరు రాజ్య దివాను రంగయ్య గుర్తించి ప్రభుత్వానికి సిఫారస్సు చేసి స్కాలర్షిప్ ఇప్పించారు. దానితో విశ్వేశ్వరయ్య పూనె వెళ్లి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పబ్లిక్ వర్క్స్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా నియమించింది. ఆ తరువాత సంవత్సరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నియమితులయ్యారు. బ్రిటీష్ పాలకులు విశ్వేశ్వరయ్య కార్యదీక్షను గుర్తించారు. ప్రపంచ జలాశయాల్లో ఒక్కటైన సుక్నూర్బరాజ్ నిర్మాణానికి ఇంజనీర్గా నియమించారు. దీంతో సింధూనది నీరు సుద్నోరుకు చేరేలా చేశారు విశ్వేరయ్య తన ప్రతిభతో. ఆ నది నీరు ఫిల్టర్ చేయటానికి ఒక వినూత్న విధానం రూపొందించారు విశ్వేశ్వరయ్య. నంబనది మీద సైఫన్ పద్ధతితో ఓ కట్ట నిర్మించారు. అక్కడ విశ్వేశ్వరయ్య మేధాశక్తితో ఆటో మేటిక్ గేట్లు నిర్మించి సమస్య తొలగించటంతో ఆయన ప్రతిభకు అందరు ఆశ్చర్యపోయారు. దీంతో 1909లో మైసూర్ ప్రభుత్వం ఆయనను చీఫ్ ఇంజనీర్ గా నియమించింది.
Read more : భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్..అచ్చు ఎయిర్ పోర్టులా ఉంది..!!
విశ్వేశ్వరయ్య కృషి..చరిత్రలో నిలిచిపోయిన గుర్తులు
కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట, బృందావన్ గార్డెన్, భద్రావతి ఉక్కు కర్మాగారం, మైసూర్ బ్యాంక్, దక్కన్ ప్రాంతంలో నీటిపారుదల వ్యవస్థ, స్వయంచాలిత వరదనీటి గేట్లు, హైదరబాద్ కు వరద నీటి రక్షణ వ్యవస్థ, విశాఖపట్టణం రేవులో భూకోతను నివారించడం, తిరుమల, తిరుపతి మధ్య రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక, ఆసియాలోనే మొదటి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్, మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీ, శ్రీ జయాచామరాజేంద్ర పాలిటెక్నిక్ కళాశాల, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, మైసూర్ చక్కెర మిల్లులు. ఇలా ఎన్నో ఎన్నెన్నో ఆయన మేథాశక్తికి నిదర్శనంగా నిలిచాయి.
నీటి వృధాను అరికట్టిన విశ్వేశ్వరయ్య అసాధారణ ప్రతిభ..
కృష్ణరాజసాగర్ డ్యాం డిజైన్ విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలోనే నిర్మాణం జరిగింది. వర్షపు నీటిని ప్రాజెక్టుల ద్వారా నిలుపుదల చేయడం,ప్రవహించే నీటిని అడ్డుకుని అనకట్టలు కట్టి బీడువారిని భూముల్ని సస్యశ్యామలం చేయటం ఆయన ప్రత్యేకత. పారే నీటిని ఉక్కు తలుపుల ద్వారా అరికట్టిన రూపశిల్పి ఆయన.
100 ఏళ్ల క్రితం హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థకు రూపశిల్పి కూడా ఈయనే. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ డ్రైనేజీ పద్ధతులకు రూప కల్పన చేసిన మేథావీ విశ్వేశ్వరయ్య. ప్రముఖ ఇంజినీర్లు అయిన కె.ఎల్.రావు, జాఫర్ అలీలు కూడా విశ్వేశ్వరయ్య సహాయ సహకారాలు తీసుకున్న వారే. విశ్వేశ్వరయ్యకు 1948 లో మైసూర్ ప్రభుత్వం డాక్టరేట్ ఎల్ఎల్డి ఇచ్చి సత్కరించింది. బాంబే, కలకత్తా, బెనారస్, అలహాబాద్ తదితర యూనివర్శిటీలు డాక్టరేట్ పురస్కారాలను అందజేసి తమ గౌరవాన్ని చాటుకున్నాయి. భారత ప్రభుత్వం 1955లో భారతరత్న అవార్డును ప్రధానం చేసి ఘనంగా సన్మానించిందీ అపర వేధావిని.
విశ్వేశ్వరయ్య ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ సభ్యులుగా, కర్ణాటకలో చీఫ్ ఇంజనీరుగా అనేక బాధ్య తలను నిర్వహించి సివిల్ ఇంజనీరింగ్లో అప్పట్లోనే నూతన ఒరవడులను సృష్టించి ప్రపంచ స్థాయిలో రికార్డుల్ని బ్రేక్ చేశారు. 1962, ఏప్రిల్ 12న విశ్వేశ్వరయ్య కన్నుమూశారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డేగా జరుపుకొంటున్నాం. విశ్వేశ్వరయ్య పూర్వీకులు పూజించే దేవాలయం మోక్షగుండం ముక్తేశ్వరాలయం నేటికి భక్తులతో ప్రత్యేక పూజలు అందుకుంటోంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకుల గ్రామం మోక్షగుండం గ్రామస్తులంటే కర్ణాటక రాష్ట్రంలో ఎంతో గౌరంగా చూస్తారు. విశ్వేశ్వరయ్య 101 సంవత్సరాలు జీవించారు. ఇంజనీరింగ్ రంగానికే పితామహుడయ్యారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య.
హైదరాబాదు నగరాన్ని వరదల నుండి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినపుడు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మారుమ్రోగిపోయింది. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర వహించారు. కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు అతను పర్యవేక్షణలోనే జరిగింది. అప్పట్లో కృష్ణరాజ సాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతిపెద్దది.
1911లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించిన తరువాత అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థే ఈనాటికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.