IND Vs ENG : కెఎల్ రాహుల్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత
అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు గాను కెఎల్ రాహుల్ పై మ్యాచ్ రిఫరి ఫైన్ విధించారు. అంతేకాకుండా డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు.
IND Vs ENG : క్రికెట్ మ్యాచ్ లో పొరపాట్లు సర్వసాధారణం.. కొన్ని సార్లు ఔట్ కాకముందే అంపైర్ ఔట్ ప్రకటిస్తారు.. మరికొన్ని సార్లు ఔట్ అయినా ఇవ్వరు. అయితే తాజాగా ఇంగ్లాండ్, భారత్ మ్యాచ్ లో ఇదే జరిగింది. భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు మొదటి సెషన్ 34వ ఓవర్ ఆండర్సన్ బౌలింగ్ చేస్తుండగా రాహుల్ క్రీజ్ లో ఉన్నాడు. ఆండర్సన్ వేసిన బంతిని ఆఫ్ డ్రైవ్ చేసే టైంలో లైట్ గా బ్యాట్ కి టచ్ అయింది.. బెయిర్స్టో దానిని క్యాచ్ అందుకొని అపీల్ చేశాడు.
అయితే మొదట ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ప్రకటించాడు.. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రివ్యూకి వెళ్ళాడు. రివ్యూలో బంతి బ్యాట్ ఎడ్జ్ కి తగిలినట్లు తేలడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం మార్చుకొని ఔట్ ప్రకటించాడు. అయితే అంపైర్ నిర్ణయంపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అతనిపై ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 ఉల్లంఘన నేరం కింద జరిమానా విధించారు మ్యాచ్ రిఫరి క్రిస్ బ్రాడ్.
దీంతోపాటు రాహుల్ క్రమశిక్షణ రికార్డ్లో ఒక డీమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు. రాహుల్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించారు.