లాక్ డౌన్ లో పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య.. నెల రోజుల్లో ప్రేమజంటకు ఏం జరిగింది

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 11:07 AM IST
లాక్ డౌన్ లో పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య.. నెల రోజుల్లో ప్రేమజంటకు ఏం జరిగింది

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న జంట నెల రోజులు తిరగకముందే ఆత్మహత్య చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో ఆ ప్రేమ జంట గుడిలో పెళ్లి చేసుకుంది. అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య చేసుకుంది ఈ నెల రోజల్లో అసలేం జరిగింది? నవ దంపతులకు ఏం కష్టం వచ్చింది? ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం సంతోషంగా ఉంటారని అందరూ అనుకున్నారు. ఇంతలో నవ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో అంతా షాక్ తిన్నారు. 

పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్న ప్రేమ జంట:
తిరువణ్ణామలై జిల్లా తానియంబట్టు తాలుకా మోదకాల్‌ గ్రామానికి చెందిన వేటియప్పన్‌ కుమారుడు జయకుమార్, క్రిష్ణగిరి జిల్లా కల్లూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మిలు గత మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పనిపై కల్లూరు వెళ్లిన జయకుమార్ కు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న విజయలక్ష్మితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించి వారి కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అయితే వారికి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు నిరాకరించారు. తాను విజయలక్ష్మిని తప్ప వేరే యువతిని పెళ్లి చేసుకోనని, కావాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతానని జయకుమార్ తేల్చి చెప్పాడు. విజయలక్ష్మి కూడా అదే మాట చెప్పింది. దీంతో పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. ఏప్రిల్ 6న గ్రామంలోని ఆలయంలో జయకుమార్, విజయలక్ష్మి కేవలం 10 మంది సమక్షంలో చాలా సంతోషంగా నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. జయకుమార్ స్వగ్రామం మోదకాల్ లోనే వేరు కాపురం పెట్టి నివసిస్తున్నారు.

పెళ్లయిన నెల రోజుల్లోనే ఆత్మహత్య:
కాగా, మంగళవారం దంపతులు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా ఇద్దరూ గదిలో ఉరేసుకుని కనిపించారు. దీంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. ఆ తర్వాత తేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాలను తిరువణ్ణామలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ విషయం తెలిసిన ఇరువురి కుటుంబసభ్యులు సైతం షాక్ తిన్నారు. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు ఇద్దరూ సంతోషంగా ఉంటారని అనుకున్నాము, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని విలపించారు. కాగా, నవ దంపతుల ఆత్మహత్య మిస్టరీగా మారింది. వీరి సూసైడ్ కు కారణం ఏంటి? ఆర్థిక సమస్యలా? లేక కుటుంబ కలహాలా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో మిస్టరీని చేధిస్తామన్నారు. కాగా లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న ప్రేమ జంట అదే లాక్ డౌన్ లో పెళ్లయి నెల రోజులు కూడా తిరక్కుండానే ఇలా విగతజీవులుగా మారడం అందరిని కలిచివేసింది.

Read Here >> మిర్యాలగూడలో డెంటల్ డాక్టర్ శ్వేత ఆత్మహత్య, అసలేం జరిగింది