Oxygen Plant : ఆక్సిజన్ ప్లాంట్ పెడితే ప్రభుత్వం నుంచి రూ.కోటి సబ్సిడీ
ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకొనువారికి ప్రభుత్వం రూ. కోటి రూపాయల సబ్సిడీ అందించనుంది.
Oxygen Plant : కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో ఆక్సిజన్ కొరతతో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఆక్సిజన్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే నిర్దారణకు వచ్చాయి. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు సబ్సిడీ అందిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేవారికి పెట్టుబడిలో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.కోటి వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్టు గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనితోపాటు జనరల్ క్యాటగిరీ వారికి టీ-ఐడియా (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూవర్ అడ్వాన్స్మెంట్), ఎస్సీలకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూవర్స్) కింద ఇచ్చే రాయితీలను యథావిధిగా కొనసాగించనున్నట్టు పేర్కొంది.
ఆగస్టు చివరి వరకు ఉత్పత్తి మొదలయ్యే ప్లాంట్లకే ఈ సబ్సిడీ వర్తిస్తుంది. అయితే ప్లాంట్ ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. ఇప్పటికైనా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని రాయితీలు వర్తింపజేస్తామని చెప్తున్నారు.