IPL 2023, RR vs CSK: చెన్నైకి షాక్.. వరుస విజయాలకు బ్రేక్.. రాజస్థాన్ గెలుపు
IPL 2023, RR vs CSK:ఐపీఎల్లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది.
IPL 2023, RR vs CSK:ఐపీఎల్లో భాగంగా జైపూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే(52; 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా రుతురాజ్ గైక్వాడ్(47; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడినా ఫలితం లేకుండా పోయింది. రాజస్థాన్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టగా ఆఖర్లో ధ్రువ్ జురెల్(34; 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవదత్ పడిక్కల్(27 నాటౌట్; 13 బంతుల్లో 4 ఫోర్లు) ధాటిగా ఆడడంతో స్కోరు 200 పరుగులు దాటింది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే రెండు వికెట్లు తీయగా మహేశ్ తీక్షణ, రవీంద్ర జడేజా ఒక్కొ వికెట్ పడగొట్టారు.
IPL 2023, RR vs CSK: చెన్నై పై రాజస్థాన్ విజయం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్ధాన్కు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓ వైపు జోస్ బట్లర్(27; 21 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతుంటే మరో వైపు జైశ్వాల్ దూకుడుగా ఆడాడు. జైశ్వాల్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 64/0 తో నిలిచింది. అదే ధాటిని కొనసాగిస్తూ జైశ్వాల్ 26 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి బట్లర్ ఔట్ అయ్యాడు. దీంతో 86 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
వన్ డౌన్లో వచ్చిన సంజు శాంసన్(17; 17 బంతుల్లో 1ఫోర్) వేగంగా ఆడలేకపోయాడు. జైశ్వాల్ దూకుడు కొనసాగించాడు. అయితే.. తుషార్ దేశ్పాండే ఒకే ఓవర్లో సంజు శాంసన్, జైశ్వాల్ పెవిలియన్కు పంపి రాజస్థాన్ను గట్టి దెబ్బతీశాడు. మరికాసేపటికే హెట్మెయర్(8) కూడా ఔట్ కావడంతో రాజస్థాన్ 146/4తో నిలిచింది. అయితే.. ఆఖర్లో ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్ ధాటిగా ఆడడంతో రాజస్థాన్ 200 పరుగుల మార్క్ను ధాటింది.