రామ్ చరణ్ లైనప్ అదిరిందిగా!..
Ram Charan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టారు. దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చెయ్యడంతో చరణ్ తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టారు. ఓ స్టార్ డైరెక్టర్, మరో యంగ్ డైరెక్టర్తో సినిమాలు ఫిక్స్ చేసేశారు చరణ్.
‘వినయ విధేయ రామ’ తర్వాత నిర్మాతగా ‘సైరా’ సినిమా చేసిన చరణ్.. అప్పటినుండి ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తూనే.. మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్ 13న, ‘ఆచార్య’ మే 13న విడుదల కానున్నాయి.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూటింగులో పాల్గొంటున్న చెర్రీ తర్వాత ఇండియాలో టాప్ డైరెక్టర్గా పేరొందిన శంకర్తో సినిమా చెయ్యబోతున్నారు. ‘రోబో’ టైంలో స్వయంగా చిరంజీవే తనతో సినిమా చెయ్యమని శంకర్ని అడిగారు కానీ వీలు పడలేదు. మెగాస్టార్ కాకపోయినా ఆయన వారసుడు మెగా పవర్స్టార్ రామ్ చరణ్, శంకర్తో సినిమా చెయ్యనుండడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
‘జెర్సీ’ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తోనూ ఓ సినిమా చెయ్యబోతున్నారు చరణ్. ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలందుకున్న గౌతమ్.. ‘జెర్సీ’ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేశారు. తెలుగులో రెండో సినిమా రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో చెయ్యబోతున్నారు గౌతమ్ తిన్ననూరి.