Sonu Sood: ఎన్నికల సంఘం ప్రచారకర్తగా తప్పుకున్న సోనూసూద్
సోనూసూద్ "పంజాబ్ రాష్ట్ర ఐకాన్- ఎన్నికల సంఘం ప్రచారకర్త" స్థానం నుంచి వైదొలిగారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు
Sonu Sood: ప్రముఖ సినీ నటుడు, వితరణశీలి సోనూసూద్ “పంజాబ్ రాష్ట్ర ఐకాన్- ఎన్నికల సంఘం ప్రచారకర్త” స్థానం నుంచి వైదొలిగారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం సోనూసూద్ ట్విట్టర్ ద్వారా వివరాలు వెల్లడించారు. “అన్ని మంచి విషయాల్లాగే, ఈ ప్రయాణం కూడా ముగిసింది. పంజాబ్ రాష్ట్ర చిహ్నంగా నేను స్వచ్ఛందంగా వైదొలిగాను. త్వరలో రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో నా కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న నేపథ్యంలో నేను మరియు EC పరస్పరం ఈ నిర్ణయం తీసుకున్నాము” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో తన సొంత రాష్ట్రమైన పంజాబ్ లో సోనూసూద్ కు మంచి ఆదరణ లభించింది. దీంతో ఆయన్ను పంజాబ్ స్టేట్ ఐకాన్ గా పేర్కొంటూ ఎన్నికల సంఘం తరపున ప్రచారకర్తగా నియమించింది ఈసీ.
Also read: Terrorist Encounter: ఆ ముగ్గురు ఉగ్రవాదులు జైషే ఈ మహ్మద్ సంస్థకు చెందిన వారు
ఎన్నికల సంఘం ప్రచారకర్తగా పంజాబ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వోటింగ్ శాతం పెంచేలా ఓటర్లను ప్రభావితం చేసేందుకు సోనూసూద్ కృషి చేశారు. కాగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కూడా పోటీచేస్తున్నారు. దీంతో ప్రచారకర్తగా సోనూసూద్ నియామకాన్ని ఈసీ ఉపసంహరించుకుంది. అయితే సోనూసూద్ సోదరి మాళవిక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారనే విషయంపై స్పష్టత రాలేదు. గతంలో ఢిల్లీలో పాఠశాల విద్యార్థుల కోసం చేపట్టిన “దేశ్ కా మెంటర్స్” కార్యక్రమానికి సోనూ సూద్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అనంతరం పలు సందర్భాల్లో వీరిరువురు స్నేహపూర్వకంగా కలిశారు. దీంతో వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో సోనూ సోదరి మాళవిక కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Like all good things, this journey has come to an end too.I’ve voluntarily stepped down as the State Icon of Punjab.This decision was mutually taken by me and EC in light of my family member contesting in Punjab Assembly Elections.
I wish them luck for future endeavours.??— sonu sood (@SonuSood) January 7, 2022
Also read: Corona Flight: దేశంలోకి కరోనాను మోసుకొస్తున్న విమాన ప్రయాణికులు