Tihar jail : మనీశ్ సిసోడియాను ఉంచిన తీహార్ జైలులో సర్జికల్ బ్లేడ్లు, ఫోన్లు, డ్రగ్స్తో పట్టుబడ్డ ఖైదీ..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఉంచిన తీహార్ జైలులో సర్జికల్ బ్లేడ్లు,ఫోన్లు, డ్రగ్స్తో పట్టుబడ్డాడు ఓ ఖైదీ.. మనీశ్ సిసోడియాను హత్య చేయటానికి కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపిస్తున్న క్రమంలో తీహార్ జైల్లో ఖైదీ వద్ద సర్జికల్ బ్లేడ్లు పట్టుబడటం ఆసక్తికరంగా మారింది.
Tihar jail : తీహార్ జైలు. దక్షిణా ఆసియాలోనే అతి పెద్ద జైలు. కరడుకట్టిన నేరస్థులను ఉంచే జైలు. అటువంటి జైలులో ఓ ఖైదీ వద్ద సర్జికల్ బ్లేడ్లు,ఫోన్లు, డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించారు జైలు అధికారులు. వాటిని వెంటనే స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడనుంచి వచ్చాయా? ఎలా వచ్చాయి? అని దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పటిష్టమైన సెక్యూరిటీ ఉండే జైల్లోకి అవి ఎలా వచ్చాయని దర్యాప్తు చేయగా గుర్తుతెలియని వ్యక్తి జైలు గోడ బయట నుంచి లోపలికి ఓ ప్యాకెట్ ను విసిరినట్లు గుర్తించారు. ఖైదీ వద్ద ఉన్న ఆ ప్యాకెట్ లో 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు ఓ సిమ్ కార్డు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే వాటిని ఎవరికోసం తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? ఎవరు వీటిని జైలులోపలికి పంపిచారు? దీని వెనుక ఎవరున్నారు? అవంటి పలు కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గురువారం (మార్చి9,2023) ఉదయం 6.40గంటల ప్రాంతంలో కొతమంది ఖైదీలు అనుమానాస్పదంగా వ్యవహరించటంతో అనుమానం వచ్చిన జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. తీహార్ సెంట్రల్ జైలు మూడో నంబర్ సిబ్బంది అనుమానాస్పద కదలికలు ఉన్న ఖైదీలను అడ్డుకుని తనిఖీ చేయగా ఒక ఖైదీ వద్ద నుంచి 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, రెండు స్మార్ట్ఫోన్లు, సిమ్ కార్డ్లు, ఇతర వస్తువులతో కూడిన ప్యాకెట్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్యాకెట్ను పక్కనే ఉన్న జైలు గోడల మీదుగా జైలు లోపల విసిరినట్లుగా భావిస్తున్నామని..దీనిపై విచారణ జరుపుతున్నామని అధికారి తెలిపారు.
Manish Sisodia: మనీశ్ సిసోడియాకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు
కాగా లిక్కర్ స్కామ్ లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం,ఆప్ నేత మనీశ్ సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నారు. ఈక్రమంలో సిసోడియాను హత్య చేయటానికి కుట్ర జరుగుతోందని..ఆప్ ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో అదే తీహార్ జైల్లో ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, ఫోన్లు పట్టుబడటం ఆసక్తిగా మారింది.