తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల… బాలికలదే పైచేయి

  • Published By: srihari ,Published On : June 18, 2020 / 10:26 AM IST
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల… బాలికలదే పైచేయి

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం (జూన్ 18) మధ్యాహ్నం ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ విద్యా సంవత్సరాలకు మొత్తంగా 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారు. 67.47 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలురు 52.30 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి సబితా వెల్లడించారు. 

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 2,83,462 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో మొత్తం 68.86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సర ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. 75.15 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 62.10గా నమోదైంది. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్  జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. రెండో సంవత్సరం ఫలితాల్లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీమ్ జిల్లా తొలి స్థానంలో నిలిచింది. ఇక సప్లిమెంటరీ పరీక్షల వివరాలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి సబితా తెలిపారు.