మా ఆవే మాకు ఆడబిడ్డ : గోమాతకు శ్రీమంతం

మా ఆవే మాకు ఆడబిడ్డ : గోమాతకు శ్రీమంతం

telangana pregnant cow seemantham : తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన దంపతులు తమకు ఆడపిల్లలు పుట్టని లోటును ఓ గోమాత రూపంలో తీర్చుకుంటున్నారు. ఆడపిల్లలు లేని మాకు మా ఆవే మా ఆడబిడ్డ అని మురిసిపోతున్నారు. తమ ఆవుని సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. ఈక్రమంలో ఆ ఆవు గర్భం దాల్చింది. ఇక వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వారు ‘ఆవుకు వైభవంగా సీమంతం’ చేశారు.

వరంగల్‌ లోని హన్మకొండ ఎస్‌బీహెచ్‌ కాలనీలోని పీజేఆర్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న పాశికంటి వీరేశం, శోభ దంపతులకు ఆడపిల్లలు లేరు. నలుగురు కొడుకులే. ఆడబిడ్డ లేదనే దిగులు వారిని వెంటాడుతుండేది. వీరేశానికి ఆవులంటే చాలా ఇష్టం. దీంతో ఓ ఆవును పెంచుకుంటే ఆడపిల్లలేని లోటు తీరుతుందని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వీరేశం తన రెండవ కొడుకు శ్రావణ్‌కుమార్‌ను తీసుకెళ్లి నెల రోజుల క్రితం గీసుగొండనుంచి రూ.30,000 పెట్టి ఓ ఆవును కొనుక్కొచ్చారు.

వీరేశం కుటుంబం ఉండేది అపార్ట్ మెంట్ లో కాబట్టి కొనుక్కొచ్చిన ఆవు కోసం ప్రత్యేకించి ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని దాంట్లో ఆవును పెట్టి సొంత కూతురిలా పెంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆవు గర్భం (సూడి కట్టింది) దాల్చింది. దీంతో వీరేశం కుటుంబాన్ని ఎంతో ఆనందం కలిగింది. సొంత కూతురే గర్భం దాల్చినట్లుగా సంబరపడిపోయారు. ఈ క్రమంలో ఆవుకు హిందూ సంప్రదాయ పద్ధతిలో సీమంతం చేశారు.

వరంగల్‌కు చెందిన ధరణి సాయి సేవా సంఘ్‌ కొంత కాలంగా కరీమాబాద్‌లోని గోశాలల్లో ప్రతి శుక్రవారం గోవులకు గడ్డి అందిస్తున్నారు. వీరేశం దంపతులు పెంచుకుంటున్న ఆవు గర్భం దాల్చిందని తెలుసుకున్న సభ్యులు సీమంతం చేయాలని నిర్ణయించి వీరేశం దంపతులకు చెప్పారు.

వారి అంగీకారంతో ఆదివారం ఎస్‌బీహెచ్‌ కాలనీలోని గోమాత ఉండే స్థలంలోనే వరంగల్‌ కాశీబుగ్గ రామాలయం పూజారి మధుచారి సమక్షంలో ఆవుకు సీమంతం నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆవుకు గాజులు, పూలు, పండ్లు, చీరె, పసుపు, కుంకుమ పెట్టి వైభవంగా వేడుక జరిపి మురిసిపోయారు.