UP Election Results : యోగీ ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరు? యూపీ బీజేపీలో పెద్ద ప్రశ్న ఇదే..!
UP Election Results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఐదింట్లో నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది.
UP Election Results : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఐదింట్లో నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది. యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ వరుసగా రెండోసారి విజయం సాధించి యూపీ అధికార పీఠాన్ని అధిరోహించనుంది. యూపీలో అధికారం కోసం హోరాహోరీగా జరిగిన పోరులో కాషాయ జెండా మరోసారి రెపరెపలాడనుంది. యూపీలో బీజేపీని గద్దె దించేందుకు శతవిధాలుగా ప్రయత్నించిన సమాజ్ వాదీ పార్టీ పరాజయాన్ని మూటగట్టుకుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫలితాల ప్రకారం.. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీలో 255 స్థానాల్లో గెలిచింది. తన మిత్రపక్షాలతో కలిపి బీజేపీ 273స్థానాలను దక్కించుకుంది. యూపీలో మూడు దశాబ్దాల చరిత్రలో వరుసగా రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీగా బీజేపీ అవతరించింది.
ప్రత్యర్థి పార్టీ అయిన సమాజ్ వాదీ పార్టీ తన మిత్ర పక్షాలతో కలిపి 135 స్థానాలకు పరిమితమైంది. యూపీ ఎన్నికల్లో విజయంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న బీజేపీని సంకటంలో పడేసింది. యూపీ సీఎంగా రెండోసారి కూడా యోగి ఆధిత్యనాథ్.. ఇందులో ఎలాంటి డౌటే లేదు.. కానీ, యోగి తర్వాత నెం. 2 ఎవరు అన్నదే పెద్ద ప్రశ్న.. ఎందుకంటే.. డిప్యూటీ సీఎంగా నెంబర్ 2 స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. సిరతు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలిచిన కేశవ్ ప్రసాద్.. ఆయన ప్రత్యర్థి, అప్నా దళ్ (కామెరవాడి)కి చెందిన అభ్యర్థి పల్లవి పటేల్ చేతిలో దాదాపు 7వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో అప్నాదళ్ (Kamerawadi) సమాజ్ వాదీ పార్టీకి మిత్రపక్షంగా ఉంది.
UP Election Results : మౌర్య గెలుపు కోసం ప్రధాని మోదీ రంగంలోకి దిగినా..
ప్రతిష్టాత్మకమైన సిరతు నియోజవర్గంలో బీజేపీ గట్టిగానే ప్రచారం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మౌర్య తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదేవిధంగా బీజేపీకి సన్నిహితంగా ఉండే అనుప్రియా పటేల్ కూడా మౌర్య తరఫున ప్రచారం నిర్వహించారు. అనుప్రియా అప్నాదళ్ (Kamerawadi) అభ్యర్థి పల్లవి పటేల్కు సోదరి కూడా. ఇంతమంది కలిసి ప్రచారం నిర్వహించినా డిప్యూటీ సీఎం మౌర్య సిరతు స్థానంలో పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ముందుగా మౌర్యనే ఆధిక్యంలో కొనసాగారు. మొదటి రౌండ్లో కేశవ్ ప్రసాద్ మౌర్య లీడ్లో ఉన్నారు. అదే సమయంలో మౌర్య ట్విట్టర్ వేదికగా.. ‘ ప్రజలు గెలుస్తున్నారు. గూండాయిజం ఓడిపోతోంది’ అంటూ ట్వీట్ చేశారు. కానీ, అనూహ్య రీతిలో పల్లవి పటేల్ ఎన్నికల్లో విజయం సాధించారు.
UP Election Results : మౌర్య సహా మరో 10 మంది బీజేపీ అభ్యర్థులు పరాజయం :
యూపీలో యోగీ సారథ్యంలో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అందులో యోగీ ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా మరో 10 మంది మంత్రులు ఓడిపోయారు. మౌర్యను పక్కన పెడితే రెండో డిప్యూటీ సీఎం రేసులో ఉన్న వ్యక్తి దినేశ్ శర్మ.. ఈయన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. ఒకవేళ డిప్యూటీ సీఎం మౌర్య ఎన్నికల్లో గెలిచి ఉంటే ఆయనకే కచ్చితంగా మరోసారి డిప్యూటీ సీఎం దక్కేది.
అయితే, కేశవ్ మౌర్య ఎన్నికల్లో ఓడినప్పటికీ కూడా ఆయన శాసనమండలికి ఎన్నిక అవుతారని బీజేపీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేగానీ, జరిగితే కేశవ్ మౌర్య మరోసారి డిప్యూటీ సీఎంగా కొనసాగుతారా? లేదా మరొకరు ఆ స్థానంలో వస్తారా? అనేది క్లారిటీ లేదు. ఏదిఏమైనా.. యోగి ఆధిత్యనాథ్.. ఇప్పటివరకూ శాసన మండలి సభ్యుడిగానే ఉన్నారు. గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి యోగి మొదటిసారి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనే ఆయన మొట్ట మొదటి సారి గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలుపొందారు.
Read Also : Yogi Adityanath : ప్రధాని మోదీ నాయకత్వంలో మరోసారి యూపీని కైవసం చేసుకున్నాం : యోగి ఆదిత్యనాథ్