తప్పు చేశాను… బ్లేడ్ గణేష్ అని పిలవొద్దు : చిరంజీవి వందేళ్లు చల్లగా ఉండాలి

  • Published By: veegamteam ,Published On : January 6, 2020 / 03:17 AM IST
తప్పు చేశాను… బ్లేడ్ గణేష్ అని పిలవొద్దు : చిరంజీవి వందేళ్లు చల్లగా ఉండాలి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేడి అమితాబ్ విజయశాంతి 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. తొలిసారి మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు సినిమా కోసం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ వేడుకలో అనేక ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తనను బ్లేడ్ గణేష్ అని పిలవొద్దని రిక్వెస్ట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత తనని ఎవరూ బ్లేడ్ గణేష్ అని పిలవొద్దని… బండ్ల గణేష్ అని బండ్ల గణేష్ ప్రేక్షకులను కోరారు. 

చిరంజీవి సంస్కారానికి పాదాభివందనాలు:
ప్రపంచంలోనే ఎవరైనా నేను, నా కొడుకు, నా వాళ్లు బాగుండాలని కోరుకోవడం న్యాయం, ధర్మం. కానీ, వాటన్నింటికీ అతీతుడు మెగాస్టార్ చిరంజీవి. ఒక మెగాస్టార్ మరో సూపర్ స్టార్ కోసం వచ్చిన ఆయన సంస్కారానికి పాదాభివందనాలు. మీరు వందేళ్లు చల్లగా ఉండాలి. మీరు మహేష్ బాబు పక్కనే ఉంటే మరో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీయొచ్చేమో. మీరు అన్నదమ్ములుగా నటించాలని కోరుకుంటున్నా. అసలు మెగాస్టార్ మళ్లీ నటించాలని బలంగా కోరుకున్న వాళ్లలో నేనూ ఒకడిని. అందుకు ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నా. నన్ను మర్చిపోయి అన్ని సినిమాలు వాళ్ల అబ్బాయికే చేస్తున్నారు.

ఈ సినిమా మహేష్ కెరీర్ లో నెం.1 సినిమా అవుతుంది. అనిల్ రావిపూడి దీన్ని రూ.250కోట్లు కొల్లగొట్టేలా తీశాడు. ఈ సినిమా తర్వాత నన్ను దయ చేసి బ్లేడ్ అని ఎవరూ అనొద్దు.. బండ్ల గణేష్ అనే పిలవండి. ఏదో తెలిసో తెలియకో నోరు జారా. ఇక నుంచి బండ్ల గణేష్ గానే మీ ముందు ఉండాలని కోరుకుంటున్నా” అని బండ్ల గణేష్ అన్నారు.

గతంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే.. బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో బండ్ల గణేష్ కొన్ని రోజులు కనిపించలేదు. అయితే బ్లేడ్ సిద్ధంగా ఉంది.. మరి బండ్ల గణేష్ ఎక్కడ.. అని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అన్నారు కదా.. అని అడిగారు. అలా బండ్ల గణేష్ కాస్తా.. బ్లేడ్ గణేష్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఏకంగా రాజకీయ సన్యాసమే తీసుకున్నారు. 

అమ్మతోడు.. ఇక వేరే పని చెయ్యను:
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బండ్ల గణేష్.. కొంత భావోద్వేగానికి గురయ్యారు. 30 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. మేనేజర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నేను.. నటుడిగా నిర్మాతగా మారాను. ఈ చిన్న గ్యాప్‌లో రాజకీయాల్లో వెళ్లి తప్పు చేశాను. అమ్మ తోడు ఇక నుంచి నేను సినిమాలే చేస్తాను. వేరే ఏ పనులు చేయను. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నేను బ్లేడ్ గణేష్ పాత్రను చేశాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు నన్ను అలా పిలవద్దు” అని బండ్ల గణేష్ రిక్వెస్ట్ చేశారు.

Also Read : 20ఏళ్ల తర్వాత కలిసిపోయారు.. అసలు చిరంజీవి, విజయశాంతి మధ్య ఏం జరిగింది?