Joe Biden : ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉండండి..భారతీయులకు బైడెన్ శుభాకాంక్షలు

ఇవాళ భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.

Joe Biden : ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉండండి..భారతీయులకు బైడెన్ శుభాకాంక్షలు

Biden

Joe Biden ఇవాళ భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో బైడెన్ పేర్కొన్నారు. సత్యం, అహింస అనే మహాత్మా గాంధీ సందేశాన్ని పాటిస్తూ.. సుదీర్ఘ స్వాతంత్ర్య కాంక్షను భారత్ 1947 ఆగస్టు 15న నెరవేర్చుకుందని ఆ ప్రకటనలో బైడెన్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల అభిప్రాయాలను గౌరవించాలనే సంస్థాగత నిబద్ధత.. ప్రపంచానికి ప్రేరణ కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇరుదేశాల(భారత్-అమెరికా)మధ్య ప్రత్యేక బంధం ఏర్పడేందుకు ఇదే కారణమన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల బంధం మరింత బలోపేతం కావాలని బైడెన్ ఆకాంక్షించారు. వైవిధ్యంతో కూడిన రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ప్రజలకోసం పాటుపడగలవనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలని పిలుపునిచ్చారు.

దశాబ్దాలుగా ఇరుదేశ ప్రజలు, 40 లక్షలకు పైగా భారతీయ అమెరికన్ల మధ్య భాగస్వామ్యం బలోపేతమైందని బైడెన్ తెలిపారు. అనేక సవాళ్లు, అవకాశాలు ఎదురుచూస్తున్న ప్రస్తుత సమయంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యానికి ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఏర్పడిందన్నారు.గత ఏడాది కాలంగా ఇరుదేశాలు కొత్త మార్గాల్లో తమ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకున్నాయని బైడెన్ పేర్కొన్నారు. కరోనాపై పోరాటం సహా, క్వాడ్ కూటమి ద్వారా వ్యాక్సిన్ల తయారీకి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థిక, సామాజిక, ఇతర రంగాలలో భారతదేశం సాధించిన విజయాన్ని విస్తృతంగా గుర్తించినట్లు చెప్పారు. భారతదేశం ప్రపంచ స్థాయిలో ఉన్నత ప్రతిష్టను కలిగి ఉన్నదని, సమస్యలను పరిష్కరించుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పుతిన్‌ తెలిపారు.