173మందితో డీఎంకే అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..తాత కోట నుంచే ఉదయనిధి స్టాలిన్ పోటీ

173మందితో డీఎంకే అభ్యర్థుల లిస్ట్ రిలీజ్..తాత కోట నుంచే ఉదయనిధి స్టాలిన్ పోటీ

Dmk

DMK ఏప్రిల్​ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే డీఎంకే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు 173 మందితో జాబితా విడుదల చేశారు. పార్టీలో పేరుపొందిన దురై మురుగన్​, కె.ఎన్​.నెహ్రూ, కె.పోన్ముడి, ఎమ్​ఆర్​కే పన్నీర్​సెల్వంతో పాటు దాదాపు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకే స్టాలిన్​ ప్రధాన్యతనిచ్చారు. డీఎంకే గత ఎన్నికల్లో పోటీ చేసిన సీట్ల కంటే.. ఈ సారి 7స్థానాలు తగ్గించుకొని 173 స్థానాల్లో మాత్రమే బరిలో దిగుతోంది.

తమిళనాడులో 2011 నుంచి అధికారానికి దూరంగా ఉంటోన్న డీఎంకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్‌, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టిగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. మిగతా 61 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది.

ఇక,డీఎంకే అధినేత స్టాలిన్‌ ఎప్పటిలాగే కొలతూరు స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ.. మార్చి 15న నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తానన్నారు. ప్రతి అభ్యర్థి కరుణానిధి అని భావించి కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఇవాళ విడుదల చేసిన డీఎంకే అభ్యర్థుల జాబాతాలో స్టాలిన్​ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పేరు కూడా ఉంది. ఉదయనిధి స్టాలిన్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తాత కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెన్నైలోని చెపాక్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఉదయనిధి స్టాలిన్.. మూడేళ్ల కిందటే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆయన డీఎంకే యూత్‌ వింగ్‌ సెక్రటరీగా ఉన్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అయితే అరంగేట్రంలోనే కీలక చెపాక్‌-ట్రిప్లికకేన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతుండటం విశేషం. ఈ నియోజకవర్గం డీఎంకేకు కంచుకోటగా ఉంది. గతంలో కరుణానిధి ఈ స్థానం నుంచి మూడు సార్లు పోటీ చేసి విజయం సాధించారు.1996, 2001, 2006లో వరుసగా మూడు సార్లు చెపాక్‌ నుంచి కరుణానిధి అసెంబ్లీకి వెళ్లారు. ఇందులో రెండుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఈ స్థానాన్ని కరుణానిధి కుటుంబం అదృష్టంగా భావిస్తుంది. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే ఇక్కడ జయకేతనం ఎగరవేసింది.

ఉదయనిధికి పోటీగా అన్నాడీఎంకే కూటమి తరఫున చెపాక్‌లో బరిలోకి దిగేది ఎవరో ఇంకా తెలియరాలేదు. తొలుత ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున నటి ఖుష్బూ ఇక్కడ పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే కూటమిలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కాకుండా పీఎంకేకు కేటాయించింది అన్నాడీఎంకే. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసేది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.