మందుబాబులకు షాకిచ్చిన హైకోర్టు: మద్యం అమ్మకాలపై హైకోర్టు స్టే
లాక్ డౌన్ దెబ్బకు దేశవ్యాప్తంగా మందుబాబులు మద్యం దొరకక పిచ్చోళ్లు అయిపోతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆన్లైన్లో అయిన మందు అమ్మాలంటూ విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మేరకు మందు ఆన్లైన్లో అమ్మాలంటూ నిర్ణయం తీసుకుంది. అయితే కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది.
మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జయశంకర్ నంబియార్, శజ్జీ పీ చాలేతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపొద్దంటూ పినరయి విజయన్ ప్రభుత్వాన్ని కోరింది.
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యగా.. న్యాయస్థానం స్టే విధించింది. మందు అమ్మకాలపై హైకోర్టు స్టే విధించడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు మందుబాబులు.
Also Read | ఒక వాట్సప్ అకౌంట్.. ఎన్ని ఫోన్లలోనైనా