టెలికాం కంపెనీలకు సుప్రీం షాక్: రూ.1.3లక్షల కోట్లు చెల్లించాల్సిందే
భారతీయ టెలికాం కంపెనీలకు అత్యున్నత న్యాయస్థానం బిగ్ షాక్ ఇచ్చింది. కేంద్రానికి రూ.1.3లక్షల కోట్లు చెల్లించాలంటూ తీర్పును ఇచ్చింది. టెలికమ్యూనికేషన్ విభాగం (డాట్) నిర్దేశించిన అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్)ను సమర్థిస్తూ సుప్రీం గురువారం తీర్పు వెల్లడించింది. ఈ మేర డాట్ విధించిన జరిమానాను వడ్డీతో సహా చెల్లించాలంటూ సంచలన తీర్పు చెప్పింది.
సుప్రీం కోర్టులో టెలికాం కంపెనీలు లేవనెత్తిన అంశాలు పనికిరావని కొట్టిపారేస్తూ వడ్డీతో సహా జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వానికి రూ .92,642 కోట్లను టెలికాం కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగానికి పైగా ఎయిర్టెల్, వొడాఫోన్ నుంచే చెల్లించాల్సి ఉంది.
డాట్ లెక్కల ప్రకారం Bharathi Airtel రూ .21,682 కోట్లు, Vodafone Idea రూ .28,309 కోట్లు, MTNL రూ.2 వేల 537కోట్ల చెల్లించాల్సి ఉంటుంది. డాట్ రూల్స్ ప్రకారం అడ్జెస్టెట్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లో 8 శాతం లైసెన్సు ఫీజుగా చెల్లించాలి. ఒక్కో సర్కిల్ లో 4.4 మెగాహెట్జ్ల కంటే ఎక్కువ స్పెక్ట్రం ఉన్నా మార్కెట్ ధరలు చెల్లించాల్సిందే. మరోవైపు ఈ తీర్పుతో భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ షేర్లు 4.9 శాతం, వోడాఫోన్ ఐడియా 13.3 శాతం పతనాన్ని చవిచూశాయి.
న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఏఏ నజీర్, ఎంఆర్షాలతోకూడిన సుప్రీం ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. ఏజీఆర్ ఫీజుపై 14 సంవత్సరాల నుంచి జరుగుతున్న న్యాయపోరాటంలో మొబైల్ ఆపరేటర్లు, ప్రభుత్వానికి మధ్య సమస్య పరిష్కారం చూపించింది.