Rakeshwar Singh: రాకేశ్వర్ సింగ్ రిలీజ్ వెనుక జరిగిందేంటి..?

సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్‌ చేసిన జవాను రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల..

Rakeshwar Singh: రాకేశ్వర్ సింగ్ రిలీజ్ వెనుక జరిగిందేంటి..?

Rakeshwar Singh

Rakeshwar Singh: సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్‌ చేసిన జవాను రాకేశ్వర్‌సింగ్‌ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఏప్రిల్‌ 3న మావోయిస్టులు రాకేశ్వర్‌సింగ్‌ను కిడ్నాప్‌చేసి 6 రోజుల పాటు చెరలో ఉంచుకుని మొదటి నుంచి అతనిపై సానుకూల ధోరణితోనే వ్యవహరించారు. ప్రాణానికి ఎలాంటి హామీ తలపెట్టబోమని, ప్రభుత్వం వెంటనే చర్చల ప్రక్రియ ప్రారంభించాలని, మధ్యవర్తిత్వం వహించే వారి పేర్లు ప్రకటిస్తే రాకేశ్వర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు.

బుధవారం మధ్యాహ్నం ఒక పాకలో ఏ విధమైన ఆందోళన లేకుండా కూర్చుని ఉన్న రాకేశ్వర్‌సింగ్‌ చిత్రాన్ని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. మధ్యవర్తుల పేర్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇంతలోనే అనూహ్యంగా గురువారం మధ్యాహ్నమే రాకేశ్వర్‌సింగ్‌ను మావోలు విడుదల చేసినట్టుగా బస్తర్‌ ఐజీ ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రాకేశ్వర్‌ సింగ్‌ కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది.

ఎలా విడుదల చేశారు?
రాకేశ్వర్‌ను బందీగా పట్టుకుని చర్చలకు రావాలని ప్రభుత్వానికి డిమాండ్లు విధించిన మావోయిస్టులు అకస్మాత్తుగా అతన్ని విడుదల చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసు శాఖ, గవర్నమెంట్ ఏం చేశాయనేది ఆసక్తికరంగా మారింది. మావోయిస్టులు ప్రభుత్వాధికారులను కిడ్నాప్ చేయడం, డిమాండ్లు నెరవేర్చుకోవడం, తమవారిని విడిపించుకోవడం కొత్త విషయమేమీ కాదు.. దశాబ్ద కాలం నుంచి జరుగుతున్నదే.

ఇప్పుడు కూడా పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసిన 150 మంది అమాయక గిరిజనులను విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. అదే విధంగా మావోల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్‌ ప్రహార్‌’ను నిలిపివేయాలని కూడా డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం మావోలు పైకి చెబుతున్నట్టుగానే ఎలాంటి డిమాండ్లు, షరతులు లేకుండానే జవానును వదిలేశారా? లేక తెరవెనుక ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నుంచి ఏమైనా హామీలు లభించాయా? లావాదేవీలు నడిచాయా? అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.

కూంబింగ్‌ నిలిపివేత
2012 మార్చి14న కోరాపూట్‌లో ఎమ్మెల్యే జినా హికాకాతో పాటు ఇద్దరు ఇటాలియన్‌ టూరిస్టులు క్లాంజియో కొలాంటిడియో, బసుస్కో పౌలోను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అంగీకరించడంతో ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు ఇటాలియన్లను ఎలాంటి హానీ తలపెట్టకుండా విడుదల చేశారు.

ఒకేసారి ఏడుగురు ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ను..!
1987లో తూర్పుగోదావరి జిల్లాలో కార్యక్రమానికి హాజరైన ఏడుగురు ఐఏఎస్‌ అధికారులను మావోలు కిడ్నాప్‌ చేయడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఐఏఎస్‌లను బందీలుగా చేసుకుని మావోలు అప్పట్లో డిమాండ్లు నెరవేర్చుకున్నారు. అనంతరం వారిని విడుదల చేశారు.

రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల వెనుక ఏం జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రహార్‌ నిలిపివేతకు, గిరిజనులకు హామీ లభించిందా? ఇతరత్రా అంశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా రాకేశ్వర్‌ సింగ్‌ సురక్షితంగా విడుదల కావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.