Thatikonda Rajaiah : కాంగ్రెస్ కీలక నేతతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ.. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్
సమావేశానికి ముందు ఇద్దరూ వెయిటింగ్ హాల్ లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చ జరిపినట్లు సమాచారం. Thatikonda Rajaiah
Thatikonda Rajaiah – Damodar Raja Narasimha : స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ మార్పుపై ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ అయ్యారు. హన్మకొండలో ఓ హోటల్ లో ఎస్సీల మేధావుల సదస్సు జరిగింది. ఈ సమావేశంలో దామోదర రాజనర్సింహ, రాజయ్య పాల్గొన్నారు.
సమావేశానికి ముందు ఇద్దరూ వెయిటింగ్ హాల్ లో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చ జరిపినట్లు సమాచారం. రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతతో రాజయ్య భేటీ కావడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. అందులో స్టేషన్ ఘన్ పూర్ కూడా ఉంది. అక్కడ రాజయ్యకు మరోసారి టికెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. రాజయ్య స్థానంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ఇచ్చారు కేసీఆర్. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ కీలక నేతతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. వీరిద్దరి భేటీపై రాజకీయవర్గాల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మారనున్నారా? అనే ప్రచారం ఊపందుకుంది.
ఎమ్మెల్యే రాజయ్య.. మొదటి నుంచి కూడా కడియం శ్రీహరిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కడియం శ్రీహరి అసలు దళితుడే కాదంటున్నారు ఆయన. అటు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సైతం రాజయ్యతో భేటీ కావడం, ఆ తర్వాత మాదిగలకు అన్యాయం జరుగుతోంది అనే స్ట్రాంగ్ వాయిస్ మందకృష్ణ మాదిగ వినిపించడం, ఇప్పుడు దళిత మేధావుల సదస్సులో రాజయ్య, దామోదర నర్సింహ భేటీ కావడం.. ఈ పరిణామాలన్నీ ఆసక్తికరంగా మారాయి.
తాను మరోసారి స్టేషన్ ఘన్ పూర్ నుంచే పోటీ చేస్తానని రాజయ్య చెబుతూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉందని, అప్పటివరకు నేను ఎమ్మెల్యేగా కొనసాగుతానని రాజయ్య అన్నారు. ఇంకా సమయం ఉందని ఆయన కామెంట్ చేయడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అనే చర్చ జరుగుతోంది.