Jasprit Bumrah : ఆసియా కప్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం

Jasprit Bumrah : ఆసియా కప్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ బౌలర్ దూరం

Jasprit Bumrah : ఆసియా కప్ క ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం(బ్యాక్ ఇంజూరీ) కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(28) టోర్నీకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ నాటికి ఫిట్ నెస్ సాధించాలనే ఉద్దేశంతో బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బుమ్రా చివరిసారి ఇంగ్లండ్ సిరీస్ ఆడాడు. లార్డ్స్ లో జులై 14న జరిగిన మ్యాచ్ లో ఉన్నాడు. ఆ తర్వాత గాయం కారణంగా విండీస్, జింబాబ్వే సిరీస్ లకు దూరమయ్యాడు. కాగా, మరో పేసర్ హర్షల్ పటేల్ కూడా గాయంతో దూరం అయ్యాడు.

మరోవైపు యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ లో పాల్గొనే టీమిండియాను బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇటీవల వెస్టిండీస్ తో సిరీస్ కు సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇక, జట్టులో కొత్త ముఖాలకు స్థానం కల్పించలేదు. ప్రధానంగా, టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఆసియా కప్ లో ఆడే భారత జట్టు ఇదే…
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్.

కాగా.. గాయాల కారణంగా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ పేర్లను పరిగణనలోకి తీసుకోలేదని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం వారు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారని వెల్లడించింది. ఇక, ఆసియా కప్ కోసం శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ స్టాండ్ బై ఆటగాళ్లుగా కొనసాగుతారని బోర్డు వెల్లడించింది. ఆసియా కప్ పోటీలు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానున్నాయి.