ఫేస్ బుక్, ట్విట్టర్ లకు షాక్
Facebook, Twitter summoned : సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు.. ఫేస్బుక్, ట్విట్టర్కు కేంద్రం షాకిచ్చింది. జాతీయంగా, అంతర్జాతీయంగా వ్యక్తిగత గోప్యతపై అత్యున్నత స్థాయిలో ప్రచారం హోరెత్తుతున్న నేపథ్యంలో.. ఈ రెండు సైట్లకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఝలక్ ఇచ్చింది. పౌరుల హక్కుల పరిరక్షణ, వారి హక్కుల దుర్వినియోగాన్ని నివారించడం.. డిజిటల్ స్పేస్లో మహిళల భద్రత తదితర అంశాలపై విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 21వ తేదీన విచారణ జరుగుతుందని తెలిపింది.
గతేడాది అక్టోబర్లో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతినిధులు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ముందు విచారణకు హాజరయ్యారు. డేటా ప్రొటెక్షన్, ప్రైవసీ అంశాలపై చర్చించారు. ఇప్పడు మరోసారి వ్యక్తిగత గోప్యతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో.. ఫేస్బుక్, ట్విట్టర్లకు విచారణకు హాజరు కావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశించింది.
ఫేస్బుక్ అనుబంధ వాట్సాప్ తన యూజర్ల ప్రైవసీ పాలసీని అప్డేట్ చేస్తున్నట్లు ప్రకటించి.. తర్వాత వెనక్కు తగ్గింది.
ఫేస్బుక్తో యూజర్ల డేటా షేర్ చేసుకుంటామని వాట్సాప్ ప్రకటించి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాట్సాప్ యూజర్లు సైతం ప్రత్యామ్నాయ సైట్లను ఆశ్రయిస్తుండటంతో.. కొత్త ప్రైవసీ పాలసీ అమలును ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మే 15వ తేదీకి వాట్సాప్ వాయిదా వేసింది.