CM KCR: తుమ్మల ఎఫెక్ట్..! ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ పిలుపు ..

ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడారు. ఈ క్రమంలో తుమ్మల లాంటి సీనియర్ నాయకులు పార్టీ వీడితే జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.

CM KCR: తుమ్మల ఎఫెక్ట్..! ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ పిలుపు ..

CM KCR

Updated On : August 26, 2023 / 3:50 PM IST

CM KCR- Tummala Nageswara Rao: ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. కేసీఆర్ మిత్రుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఖమ్మం జిల్లా పార్టీ నేతలు హైదరాబాద్ రావాలని సూచించినట్లు తెలిసింది. సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు, జిల్లా ముఖ్యనేతలు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. భేటీ తరువాత సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందనే అంశంపై జిల్లా బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. తుమ్మల పార్టీ వీడకుండా ఏమైనా చర్యలకు సీఎం కేసీఆర్ ఉపక్రమిస్తారా? తుమ్మల పార్టీ వీడినా ఇబ్బందిలేదని, జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

Tummala Nageswararao : ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా.. కానీ, ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా : తుమ్మల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్నాయి. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకుగాను 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి వ్యతిరేఖత వ్యక్తమవుతుంది. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలని భావించారు. అయితే, ఇటీవల కేసీఆర్ ప్రకటించిన జాబితాలో పాలేరులో తుమ్మలకు కాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి బీఆర్ఎస్‌లోకి వచ్చిన కందాల ఉపేందర్ రెడ్డికే పాలేరు టికెట్‌ను కేటాయించారు. దీంతో తుమ్మల వర్గీయులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తుమ్మలసైతం పాలేరు టికెట్ కేటాయించకపోవటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, తుమ్మలకు సర్దిచెప్పేందుకు పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది.

Tummala Nageswara Rao : రాజీనామా చేస్తారా? ప్రశ్నార్థకంగా తుమ్మల రాజకీయ భవిష్యత్తు, అనుచరుల కీలక సమావేశం

శుక్రవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్న తుమ్మలకు ఆయన అనుచరులు సుమారు వెయ్యి కార్లతో భారీస్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే, పాలేరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి బరిలోకి దిగుతారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. తుమ్మల తాజా వ్యాఖ్యలతో ఆయన రాజకీయ పయనం ఎటువైపు ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. తుమ్మల పార్టీ మారబోతున్నట్లు సంకేతాలు రావడంతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు.

ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్‌ను వీడారు. ఈ క్రమంలో తుమ్మల లాంటి సీనియర్ నేత పార్టీ వీడితే జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అయితే, ఖమ్మం జిల్లా నేతలతో భేటీ తరువాత వారు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ మేరకు తుమ్మల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి  నిర్ణయాన్ని వెల్లడిస్తారనే అంశం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.