Maoists Entered In Telangana : మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి రంగంలోకి దిగిన NSG బలగాలు
తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి NSG బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో 120 బృందాలు పాల్గొన్నాయి.
Maoists Entered In Telangana : తెలంగాణలో మరోసారి మావోయిస్టుల కదలికలు ప్రారంభమయ్యాయనే సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈక్రమంలో మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి NSG బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో 120 బృందాలు పాల్గొన్నాయి. భూపాలపల్లి- చర్ల వరకు ఈ 1200 మంది బలగాలు మోహరించాయి.
తెలంగాణ పరిసర ప్రాంతాలు ఒకప్పుడు మావోయిస్టుల అడ్డాగా ఉండేవి. కూబింగ్, ఎన్ కౌంటర్లులు జరుగుతుండేవి. కానీ కొంతకాలంగా అటువంటి జాడలు లేవు. కానీ మరోసారి తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టుల దళం వచ్చిందన్న సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఎస్పీలే రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
2020 సెప్టెంబరులో కదంబ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారని, మిగిలిన దళ సభ్యులు తప్పించుకుని ఛత్తీస్గఢ్ అడవులకు తరలిపోయారని పోలీసులు అప్పట్లో ప్రకటించారు. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ దళం గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని, భాస్కర్ దళంలోని 10 మంది మావోయిస్టులపై పోలీసులు 95 లక్షల రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇటీవల మావోయిస్టుల కదలికలతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్ జిల్లాల ఎస్పీలు స్వయంగా రంగంలోకి దిగి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజనులకు కౌన్సిలింగ్ చేస్తున్నారు. మావోయిస్టులకు సహాయం చేయవద్దని..మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మావోల జాడల కోసం వెతుకుతున్నారు. ఇంటింటికి తిరిగుతూ..జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు సహకరించవద్దని అలా చేస్తే మీరు కూడా చిక్కుల్లో పడతారని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఇటు పోలీసుల హెచ్చరికలు..మరోవైపు మావోయిస్టుల కదలిక ప్రారంభమయ్యాయనే సమాచారంతో గిరిజనులు అడకత్తెరలో పోక చెక్కల్లా నలిగిపోతున్నారు. మావోయిస్టులు కదలికలతో పోలీసులు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం..ఇంటింటినీ జల్లెడ పడుతున్న తీరుతో గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మావోయిస్టులకు పోలీసులకు మధ్య గిరిజన గ్రామాల ప్రజలు నలిగిపోతున్నారు.
కాగా..NSG కమాండోల ట్రైనింగ్, ఆపరేషన్లు ఓ రేంజ్లో ఉంటాయి. టెర్రరిస్టులకే వాళ్లు వెన్నులో వణుకు పుట్టిస్తారు. ఎంత రిస్కీ ఆపరేషన్ అయినా.. సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. క్షణాల్లో శత్రువులను మట్టు పెడతారు. ప్రాణాలకు తెగించి మరీ ఆపరేషన్లు చేస్తుంటారు. ఇప్పటి వరకు టెర్రరిస్ట్ ఆపరేషన్లు, ఇతర రిస్కీ ఆపరేషన్లలో ఎక్కువగా పాల్గొనే NSG బలగాలు ఇప్పుడు తొలిసారిగా మావోయిస్టులను టార్గెట్ చేశాయి. ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు ఆపరేషన్ కోసం NSG కమాండోలను రంగంలోకి దింపారు. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండడంతో NSGని రంగంలోకి దింపారు. వీరితో పాటు వందల మంది పోలీసులు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. NSG ఎంట్రీతో అడవుల్లో అలజడి మొదలైంది.