House fire In Manchiryala : పక్కా ప్లాన్తోనే ఇంటికి నిప్పంటించారు.. మంచిర్యాలలో ఇంటిలో ఆరుగురు సజీవ దహనం వెనుక షాకింగ్ విషయాలు
మంచిర్యాలలో ఇంటిలో ఆరుగురు సజీవ దహనం వెనుక షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పక్కా ప్లాన్తోనే ఇంటికి నిప్పంటించారని పోలీసులు వెల్లడించారు.
House fire In Manchiryala : తెలంగాణలోని మంచిర్యాల జిల్లా గుడిపల్లిలోని ఓ ఇంటికి నిప్పంటుకుని నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయిన ఘటనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఇది అగ్నిప్రమాదం కాదని షార్ట్ సర్య్కూట్ వల్ల జరిగిన ప్రమాదం అంతకంటే కాదని ఈ ఘటన వెనుక పక్కా ప్లాన్ ఉందని తేల్చారు పోలీసులు. శివయ్య అనే సింగరేణి కార్మికుడి ఇల్లు దహనం అయిన ఘటన సాధారణమైనది కాదని పక్కా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
శివయ్య అనే సింగరేణి కార్మికుడు కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో హిమబిందు(2), స్వీటి అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఇంటి సమీపంలో ఉన్న రెండు పెట్రోల్ క్యాన్లు కనిపించాయి. దీంతో ఎవరన్నా కుట్రపూరితంగా ఇంటికి నిప్పు పెట్టారని అనుమానించారు. ఆ దిశగా దర్యాప్తు చేయగా..పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు ఇంటికి సమీపంలోనే చాలాసేపు వేచి ఉండి ఉంటారని..ఇంటిలోంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడతారా?అని వేచి చూడటానికి..ఇల్లు మొత్తం పూర్తిగా దహనం అయ్యేవరకు సదరు వ్యక్తు కాపు కాసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి సమీపంలోని రెండు పెట్రోల్ క్యాన్లు ఉండటం..అలాగే ఓ ఆటో నిలిపి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఆటోలో కారంపొడి కూడా ఉందని గుర్తించారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఘటన జరిగిందని పోలీసులు బావిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆరుగురు మృతదేహాలకు ఘటనాస్థలంలోనే పోస్ట్ మార్టం నిర్వహించారు. శివయ్యపై కక్ష కట్టిన కొంతమంది వ్యక్తులు ముందుగా రెక్కీ నిర్వహించి ఇంటికి నిప్పు పెట్టారని జిల్లా ఎస్పీ తెలిపారు. వారు ఎవరు? ఎందుకు ఇంత దారుణానికి పాల్పడ్డారు? కారణమేంటి? పాతకక్షలేమనా ఉన్నాయా? లేదా మరేదైనా కారణాలా?అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సదరు వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. 16 బృందాలను ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.