Rudraksha : తెలంగాణా గడ్డపై రుద్రాక్షను పండించిన రైతు బిడ్డ
శివునికి ఎంతో ఇష్టంగా రుద్రాక్షలను చెప్తారు. వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్ష ధరించటం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

Rudraksha Tree1
Rudraksha : థాయిలాండ్ ,నేపాల్ తోపాటు భారతదేశంలోని హిమాలయ ప్రాంతాల్లో రుద్రాక్ష పంట ఇప్పుడు తెలుగు నేలపైన పండుతుంది. తెలంగాణా ప్రాంతంలో ఓ రైతు శ్రమ ఫలితంగా రుద్రాక్ష పంట సాగు విజయవంతమైంది. దశాబ్ధకాలనికిపైగా అతను పడ్డ కష్టానికి ప్రస్తుతం ఫలితం దక్కింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన రుద్రాక్ష సాగు సక్సెస్ కావటంతో రైతు ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా న్యాలకొండపల్లికి చెందిన ఆకుల లక్ష్మయ్య 2007 తన పొలంలో రుద్రాక్ష మొక్కలను నాటారు. హైద్రాబాద్ గ్రోమోర్ నుండి ఈ మొక్కలను తీసుకొచ్చి నాటారు లక్ష్మయ్య. అయితే అప్పట్లోనే తెలంగాణా ప్రాంతంలో ఈ మొక్కలు పెరగవని నిపుణులు సూచించారు. అయితే మొక్కలు దొరకటమే అదృష్టంగా భావించిన లక్ష్మయ్య తన పొలంలో వేశారు.
సన్నిహితులు,నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ రుద్రాక్ష చెట్లను జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. దాదాపు 30 అడుగుల ఎత్తుకు చేరుకున్న ఈ వృక్షాలకు 14 సంవత్సారాల తరువాత ఈ ఏడాది రుద్రాక్షలు కాశాయి. శీతలప్రదేశాల్లో మాత్రమే రుద్రాక్ష వృక్షాలు ఎదుగుదలకు అనువైన వాతావరణంగా చెప్తారు. ముఖ్యంగా వేడి వాతావరణం ఉండే తెలుగు నేలపై దీనిని సాగు చేసేందుకు ఇప్పటి వరకు రైతులు సాహసం చేయలేదు. అయితే ప్రస్తుతం తెలంగాణాలో రుద్రాక్ష పండటం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. లక్ష్మయ్యలో రుద్రాక్షలు పండిన విషయం తెలుసుకున్న స్ధానిక రైతులు అతని పొలాన్ని చూసేందుకు వస్తున్నారు.
శివునికి ఎంతో ఇష్టంగా రుద్రాక్షలను చెప్తారు. వీటిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. రుద్రాక్ష ధరించటం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. అందుకే మనదేశంలో రుద్రాక్షలకు మంచి డిమాండ్ ఉంది. అయితే డిమాండ్ కు తగినట్లుగా మనదేశంలో రుద్రాక్షను సాగు చేసే పరిస్ధితి లేకపోవటంతో ఇండోనేషియా, మలేషియా వంటి ప్రాంతాల నుండి కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి వస్తోంది. భారతదేశంలో సైతం కొన్ని రకాల వాతావరణాలలో ఈ చెట్లు పెరుగుతాయి. అయితే దీని సాగుకు ఎంతో సంయమనం, ఓపిక అవసరం. ఎందుకంటే ఇవి కాపుకు వచ్చేందుకు ఏక్కువ సంవత్సరాలు పడుతుంది. దీంతో చాలా మంది రైతులు సంవత్సరాల కొద్దీ ఎదురు చూసే పరిస్ధితి లేకపోవటంతో రుద్రాక్ష సాగువైపు మొగ్గు చూపటంలేదు. ప్రభుత్వం సరైన ప్రోత్సహాం అందిస్తే తెలంగాణా రైతులు రుద్రాక్ష సాగు చేపట్టవచ్చని రైతు లక్ష్మయ్య చెబుతున్నారు.