వైసీపీలో రీఎంట్రీకి ఆ కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నారా? జగన్ సుముఖంగా లేరా?
వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట ఆమంచి. మాజీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట.

Ys Jagan Mohan Reddy
Amanchi Krishnamohan: పొలిటికల్ లీడర్స్ అన్నప్పుడు జంపింగ్స్ కామన్. కాకపోతే ప్రతీ ఎలక్షన్కు ముందు ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంప్ అవడం..పోటీ చేయడం..గెలుపోటములను డిసైడ్ చేయడం..ఏ పార్టీలో ఎక్కువ రోజులు ఉండకపోవడం ఆ లీడర్ స్పెషాలిటీ. ఆయనే ఆమంచి కృష్ణమోహన్. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి..2014లో ఇండిపెండెంట్గా బరిలో నిలిచి శాసన సభలో అడుగుపెట్టిన ఆమంచి కృష్ణమోహన్..టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ..పార్టీలన్నీ తిరిగి..స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడి ఇప్పుడు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారట. వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నారట ఆమంచి.
మాజీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ద్వారా మంతనాలు జరుపుతున్నారట. అయితే ఆమంచి విషయంలో వైవీ సుబ్బారెడ్డి ప్రతిపాదనలను జగన్ తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమంచి వల్లె 2024 ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయామని.. ఆమంచి చేతులెత్తేయడంతో పర్చూరు సీటును కూడా కోల్పోవాల్సి వచ్చిందని జగన్ అభిప్రాయపడ్డారట. చీరాలలో కరుణం బలరాం తనయుడు కరుణం వెంకటేశ్ తప్ప మరొకరికి ఛాన్స్ లేదని వైవీ సుబ్బారెడ్డికి జగన్ తేల్చి చెప్పారట.
ఆందోళన ఇందుకేనా?
ఇదే విషయాన్ని ఇటీవల తాడేపల్లిలో జరిగిన వైసీపీ ముఖ్యనేతల సమావేశంలో కూడా కరణం వెంకటేశ్కు చెప్పారట జగన్. అధినేత తనతో చెప్పిన విషయాన్ని చీరాలలో వైసీపీ కార్యకర్తలకు అభిమానులకు వివరించారట కరణం వెంకటేశ్. వచ్చే ఎన్నికల్లో సరైన ప్లాట్ ఫామ్ దొరికి ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయంగా కనుమరుగవుతానని ఆందోళన చెందుతున్నారట ఆమంచి. ఆ నేపథ్యంలోనే వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తే సీటు దక్కుతుందని ఆశపడ్డారట.
కానీ వైసీపీ అధినేత అబ్జక్షన్ చెప్పడంతో డైలమాలో పడిపోయారట. 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆమంచి. 2014లో ఇండిపెండెంట్గా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమంచి..చంద్రబాబుతో విభేదాల ఏర్పడి 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019లో వైసీపీ అభ్యర్థిగా చీరాల నుంచి బరిలో నిలిచి కరుణం బలరాం చేతిలో ఓడిపోయారు ఆమంచి.
అయితే టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీ అధికారంలో ఉండటంతో ఫ్యాన్ పార్టీ గూటికి చేరారు. దీంతో ఆమంచి వర్సెస్ కరణం బలరాం మధ్య నిత్యం ఆధిపత్య పోరుతో అప్పుట్లో చీరాలలో రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవల్లో కొనసాగింది. దీంతో ఇద్దరి మధ్య ఆదిపత్యపోరు లేకుండా పరిష్కరించే మార్గాన్ని చూపుతూ ఆమంచిని పక్కనే ఉన్న పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్గా నియమించి..కరణం బలరాం కుమారుడు వెంకటేశ్కు చీరాల నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం.
Also Read: హిందూపురం దశ తిరగబోతోంది.. ఏమేం కంపెనీలు వస్తున్నాయో చెప్పిన బాలయ్య
అయితే పర్చూరు నియోజకవర్గంపై పట్టు సాధించి బరిలో నిలబడలేకపోయారు. సొంత గడ్డ చీరాలలో అడుగు పెట్టి వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆమంచి.. 2024 ఎన్నికల్లో చీరాల వైసీపీ అభ్యర్థి కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేశ్ ఓటమే ధ్యేయంగా బరిలోకి దిగారు. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు చీల్చి..కరణం వెంకటేశ్ ఓటమికి ఆమంచి కారణమయ్యారని వైసీపీ భావిస్తోందట.
ఇక ఇప్పుడు కాంగ్రెస్లో ఉండలేక పొలిటికల్ ఫ్యూచర్ కోసం సరికొత్త ప్లాన్లు వేస్తున్నారట ఆమంచి. కూటమీ పార్టీలు చేర్చుకునే అవకాశం లేకపోవడంతో..వైవీ సుబ్బారెడ్డి ద్వారా వైసీపీలో చేరేందుకు రాయబారాలు నడిపారట. అయితే ఆమంచి చేరిక కోసం వైవీ సుబ్బారెడ్డి జగన్ దగ్గర ప్రస్తావిస్తే..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని..దీంతో ఆమంచి పొలిటికల్ ఫ్యూచర్ చీరాల చౌరస్తాలో నిలిచిపోయినట్లు ఉందన్న టాక్ వినిపిస్తోంది.