Ambati Rayudu: అందుకే పవన్ అన్నను కలిశాను: అంబటి రాయుడు మరో ట్వీట్
తన భావజాలం, పవన్ భావజాలం ఒకేలా ఉన్నాయని అన్నారు.

Ambati Rayudu and Pawan Kalyan
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశాక మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ను ఎందుకు కలిశానన్న విషయంపై స్పష్టతనిచ్చారు. వైసీపీని వీడుతున్నానని, రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉంటానని ఆయన ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఓ నిర్ణయం తీసుకునే ముందు పవన్ కల్యాణ్ ను కలవాలని తన శ్రేయోభిలాషులు చెప్పారని అంబటి రాయుడు అన్నారు. అందుకే తానే పవన్ కల్యాణ్ ను కలిశానని చెప్పారు. తన భావజాలం, పవన్ భావజాలం ఒకేలా ఉన్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్ఫూర్తిగా సేవలు అందించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని అంబటి రాయుడు అన్నారు. తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకే ఇంతకుముందు వైసీపీలో చేరారని చెప్పారు. వైసీపీతో ప్రయాణంలో తన కలలు నెరవేరవని అర్థమయిందని చెప్పారు. తన భావజాలం, వైసీపీ భావజాలానికి భిన్నంగా ఉందని అన్నారు.
అందుకే వైసీపీకి దూరమయ్యానని అంబటి రాయుడు చెప్పారు. అంతేగానీ, ఏదో సీటు కోసం కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాలను వదిలేద్దామనుకున్నానని, తన సన్నిహితుల సూచనతో ‘పవన్ అన్న’ను కలిశానని పేర్కొన్నారు. ప్రస్తుతం క్రికెట్ టోర్నీలో ఆడేందుకు దుబాయ్ వెళుతున్నానని చెప్పారు.
— ATR (@RayuduAmbati) January 10, 2024
Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు..! గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి?