YCP Schemes : ఓట్లడిగేటప్పుడు వందలకొద్దీ హామీలు.. గెలిచాక ఆ హామీలను పక్కనబెట్టడం.. దశాబ్దాల ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ జరిగేది అదే.. కానీ హిస్టరీని బ్రేక్ చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామంటోంది వైసీపీ.. గెలిచిన ఏడాదిలోనే 95 శాతం హామీల అమలుతో రికార్డ్ సెట్ చేశామని కూడా ఢంకా బజాయించి మరీ చెబుతోంది ఆ పార్టీ.. మరి గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలేంటి? జస్ట్ వాచ్ ఇట్..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీది ఓ ప్రభంజనం… ఏకంగా 52 శాతం ఓట్లతో 151 సీట్లు గెల్చుకున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో టార్గెట్ 175 అంటోంది… మాట తప్పం.. మడప తిప్పం అంటూ సీఎం జగన్పై విశ్వసనీయతతోనే రెండోసారి అధికారంలోకి వస్తామంటోంది. ఇందుకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రధాన ఎన్నికల ప్రచార అంశంగా చూపుతోంది వైసీపీ… సింగిల్ పేజీ మేనిఫెస్టోతో గత ఎన్నికల్లో పోటీ చేసి అఖండ విజయాన్ని అందుకున్నారు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి.
Read Also : లాభసాటి సేద్యానికి భరోసా ఏంటి?.. చూడండి ‘10టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్మ్యాప్’లో..
తొలి ఏడాదే హామీల్లో 95 శాతం పూర్తి :
అంతేకాదు గెలిచిన తొలి ఏడాదే తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశారు. కేవలం రెండు మాత్రమే పెండింగ్లో పెట్టారు. ఆ రెండింట్లో ఒకటి ఉద్యోగుల ఓపీఎస్ కాగా, రెండోది మద్య నియంత్రణ పథకం. ఇచ్చిన మాట ప్రకారం ఈ రెండింటినీ అమలు చేయడానికి చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఉద్యోగుల ఓపీఎస్ పునరుద్ధరణ సాధ్యాసాధ్యాలు పరిశీలించిన జగన్ సర్కార్… వారిని ఒప్పించి గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ – జీపీఎస్కు రూపకల్పన చేసింది. ఇక మద్యం విక్రయాలను నియంత్రించి తన హామీల్లో 99 శాతం నెవరేర్చినట్లు చెబుతోంది వైసీపీ.
ఇలా ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో అమలు చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే.. నవరత్నాలతో 95 శాతం హామీలను అమలు చేశారు. కోవిడ్ కష్టకాలంలోనూ మాట తప్పకుండా పథకాలను కొనసాగించారు. ఉద్యోగులు అడగక ముందే 12వ పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు మెరుగైన పెన్షన్ అందించేలా జీపీఎస్ – గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విధానానికి ఆమోదం తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడం ద్వారా 99 శాతం హామీలను నెరవేర్చినట్లయింది.
కోవిడ్ కష్టకాలంలోనూ పథకాల అమలు :
ఇక అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులున్నా.. హామీల అమల్లో వెనక్కి తగ్గలేదు సీఎం వైఎస్ జగన్. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి 12 వేల 500 చొప్పున నాలుగేళ్లలో 50 వేల రూపాయలు రైతులకు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పిన సీఎం జగన్.. ఆచరణకు వచ్చేసరికి మరో వెయ్యి రూపాయలు పెంచి ఏటా 13 వేల 500 రూపాయల చొప్పున పంపిణీ చేసి తనకు తనే సాటిగా నిలిచారు.
ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇతర పథకాలనూ అమల్లోకి తెచ్చారు. 2019 ఎన్నికల తర్వాత.. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ చూడకుండా.. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఐదేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ – డీబీటీ రూపంలో 2 లక్షలా 70 వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇతరత్రా రూపాల్లో లబ్ధి చేకూర్చిన పథకాలు కూడా కలిపితే డీబీటీ ప్లస్, నాన్ డీబీటీ లబ్ధిదారులకు దాదాపు మూడున్నర లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు.
ఇచ్చిన మాట మేరకు 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సాకారం చేశారు. ఇళ్ల స్థలాల పట్టాలివ్వడంతోపాటు పక్కా గృహాన్ని మంజూరు చేసి, నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. దేశ చరిత్రలో ఒకేసారి ఇలా 31 లక్షల మందికి ఇంటి స్థలాలను ఇచ్చి.. వారి పేర్లతోనే రిజిస్ట్రేషన్ చేసిన రికార్డు కూడా వైసీపీ ప్రభుత్వానిదే… ఇన్నిహామీలను నెరవేర్చిన జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికలకు అంతకుమించి అన్న స్థాయిలో మ్యానిఫెస్టో సిద్ధం చేస్తోందని చెబుతున్నారు.