ఏపీలో కొత్తగా 3,746 కరోనా కేసులు, 27 మంది మృతి

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 74,422 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 3,746 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,93,299లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 27 మంది మరణించారు. గత 24 గంటల్లో 4,739 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో 7,54,415 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 72,71,050 మందికి శాంపిల్స్ పరీక్షించగా 33,376 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,508కు చేరుకుంది.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల గడిచిన 24 గంటల్లో కృష్ణలో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, చిత్తూరులో ముగ్గురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.