pawan kalyan and chandrababu naidu
AP Free Bus Scheme: ఏపీలో మహిళలకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు సూపర్ సిక్స్ పేరిట మహిళలకు పలు వరాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు దృష్టిసారించారు. ఈ క్రమంలో ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో మరో పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Also Read: Gossip Garage : త్వరలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ? సైకిల్ సవారీకి రెడీ అవుతున్న ఆదిమూలపు సురేశ్..!
ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగ నాటికి మహిళలకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై పలు రాష్ట్రాల్లో పర్యటించి వివరాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ.. ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. వచ్చేనెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలును ఉగాది నుంచే ప్రారంభించాలనే నిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ ‘మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు’ పథకం అమలవుతున్న తీరును, అక్కడి విధానాలను అధ్యయనం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఈ పథకంకోసం అవుతున్న ఖర్చు, బస్సుల సంఖ్య, ఉద్యోగుల నియామకం వంటి అంశాలపై సమగ్ర నివేదికను తయారు చేశారు. ఏపీలో ఉచిత బస్సు పథకాన్ని అమలుచేస్తే సంస్థపై ఏటా రూ.2,500 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు అంచనావేశారు. మరోవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా.. కేబినెట్ సబ్ కమిటీ ఉచిత బస్సు పథకం అమలవుతున్న రాష్ట్రల్లో పర్యటించి అధ్యయనం చేసింది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తే ఆటో, క్యాబ్ వంటి వారికి జరిగే నష్టాలను, అందుకోసం ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపైనా అక్కడి అధికారులను కేబినెట్ సబ్ కమిటీ అడిగి తెలుసుకుంది. అన్ని రాష్ట్రాల్లో సమగ్ర అధ్యయనం చేసిన మంత్రులు ప్రభుత్వానికి ఉచిత బస్సు పథకంపై నివేదికను అందజేసినట్లు తెలిసింది. ఆర్టీసీ ఉన్నతాధికారుల నివేదిక, కేబినెట్ సబ్ కమిటీ నివేదికలపై మంత్రి మండలి సమావేశంలో చర్చించనున్నారు. ఆ తరువాత పథకం అమలుకు విధివిధానాలు రూపొందించి ప్రకటించనున్నట్లు సమాచారం. మొత్తానికి ఉగాది నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను అందుబాటులోకి తేవాలని ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.