Schools Holidays : ఏపీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, ఎప్పటి నుంచి అంటే..
ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.
Schools Holidays : ఏపీలో స్కూళ్లకు మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి కానుండగా, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్లోడింగ్, ప్రమోషన్ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. కాగా, ఎస్సీఈఆర్టీ షెడ్యూల్ ప్రకారం టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవు.
ఎస్సీఈఆర్టీ షెడ్యూల్ ప్రకారం
* పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 30 వరకు సిలబస్ పూర్తి
* మే 1 నుంచి 16 వరకు ప్రీఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్
* మే 17 నుంచి 24 వరకు ప్రీఫైనల్ పరీక్షలు
* మే 25 నుంచి జూన్ 6 వరకు ఫైనల్ పరీక్షలకు ప్రిపరేషన్
* జూన్ 7 నుంచి 16 వరకు పబ్లిక్ పరీక్షలు
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు:
కాగా.. కరోనా వ్యాప్తి, ఎండలు అధికంగా ఉండటంతో ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఒంటిపూట బడుల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కపూటే తరగతుల నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవలే ప్రకటించారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు ఉంటాయని.. తరువాత మధ్యాహ్న భోజనం ఉంటుందని తెలిపారు. స్కూళ్ల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై టీచర్లు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేష్ సూచించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.