Srisailam Highway: భూగర్భ మార్గం ద్వారా శ్రీశైలానికి..! కేంద్రం కీలక నిర్ణయం.. అధ్యయనంకోసం రంగంలోకి..
హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

hyderabad to srisailam highway
Hyderabad – Srisailam Highway: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రధాన మార్గాల్లో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి ఒకటి. ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లేవారు చాలామంది ఈ రహదారి ద్వారానే ప్రయాణిస్తుంటారు. అయితే, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు తద్వారా వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు ఈ జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం రెడీ అయింది. అయితే, ఈ మార్గంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఉండటంతో 30 అడుగుల ఎత్తులో 62.5 కిలో మీటర్లు మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం కొద్ది నెలల క్రితం అధ్యయనం కూడా చేశారు. తాజాగా.. ఎలివేటెడ్ కారిడార్ కాకుండా భూగర్భం గుండా రహదారి నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Also Read: AP Govt: ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. కరెంట్ బిల్లులపై కీలక ప్రకటన ..
అమ్రాబాద్ టైగర్ రిజర్వు పారెస్టులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అటవీశాఖ అనుమతులతోపాటు ఎన్టీసీఏ (జాతీయ పులుల సంరక్షణ మండలి) అనుమతులు కూడా అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు రాకపోకలకు నిషేధం ఉంది. పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల సంచారం రాత్రివేళ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే, తాజాగా.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే వన్య ప్రాణులపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. మార్గంమధ్యలో ఫర్హాబాద్ గేటు వద్ద ఇరువైపులా ర్యాంపుల నిర్మాణానికి జాతీయ ఉపరితల రవాణాశాఖ అధికారులు ప్రతిపాదించగా అటవీశాఖ తిరస్కరించింది. మార్గంమధ్యలో ఎక్కడా ర్యాంపులు ఉండొద్దని స్పష్టం చేసింది.
Also Read: Kodali Nani : కొడాలి నానికి షాక్.. రంగంలోకి పోలీసులు, వారికి నోటీసులు జారీ..
అటవీశాఖ అనుమతులు రావడం కష్టంగా మారడంతో హైదరాబాద్ – శ్రీశైలం రహదారి విస్తరణకు ఎలివేటెడ్ కారిడార్ కు బదులుగా భూగర్భమార్గంపై కేంద్రం దృష్టిసారించింది. భూగర్భ రహదారి నిర్మిస్తే అటవీ, ఎన్టీసీఏ అనుమతుల సమస్య ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అధ్యయనం చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. కొద్దివారాల్లో అధ్యయనం ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ. 7వేల కోట్లు. అదే భూగర్భ మార్గమైతే కిలో మీటర్ కు రూ.200 కోట్ల చొప్పున రూ.10వేల కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రహదారి అనేక మలుపులతో ఉంది. భూగర్భమార్గం ద్వారా అయితే నేరుగా ఉంటుంది. అయితే, భూగర్భ మార్గంపై అధ్యయనం చేసిన తరువాత హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.