త్వరలో AI డాక్టర్ వచ్చి ఈ విషయాలు చెబుతుంది!: చంద్రబాబు

"పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలి. పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడానికి ముస్తాబు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం" అని తెలిపారు.

త్వరలో AI డాక్టర్ వచ్చి ఈ విషయాలు చెబుతుంది!: చంద్రబాబు

Chandrababu Naidu (Image Credit To Original Source)

Updated On : January 24, 2026 / 5:16 PM IST
  • ఎప్పుడు ఏమి తినాలో ఏఐ డాక్టర్ చెబుతుంది
  • త్వరలో సంజీవిని ప్రాజెక్టు ద్వారా మెరుగైన జీవన విధానం
  • గాలి, తిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలి

Chandrababu Naidu: భవిష్యత్తులో ఏఐ డాక్టర్ వస్తుందని.. ఎప్పుడు ఏమి తినాలో, ఎలా ఉండాలో చెబుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఇవాళ ఆయన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త్వరలో సంజీవిని ప్రాజెక్టు ద్వారా మెరుగైన జీవన విధానాన్ని అందిస్తాం. పీల్చేగాలి, తినేతిండి, తాగేనీరు కాలుష్య రహితంగా ఉండాలి. పాఠశాలల్లో విద్యార్థులు పరిశుభ్రంగా ఉండడానికి ముస్తాబు అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం.

ఈ చర్య ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. నగరాల్లో భారీ స్వీపింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేసి వినియోగిస్తున్నాం.

ఈ నెల 28వ తేది నాటికి నా రాజకీయ ప్రస్థానానికి 50 ఏళ్లు అవుతాయి. మాజీ ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన చివరి శ్వాస వరకూ ప్రజల కోసం సేవ చేశారు. ఎన్టీఆర్ పిలుపు అందుకుని ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన నిరంతరం ఈ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేశారు.

Also Read: అమెరికాలో భార్యతో పాటు ముగ్గురు బంధువులపై కాల్పులు జరిపి చంపిన భారతీయుడు.. అల్మారాలో దాక్కున్న ముగ్గురు పిల్లలు

ఏడాది క్రితం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రను ఓ ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెలా మూడో శనివారం ప్రత్యేకమైన థీమ్‌తో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతున్నాం. ఎన్టీఆర్ భరోసా ద్వారా ఏడాదికి రూ.33 వేల కోట్లను పంపిణీ చేస్తున్నది కూటమి ప్రభుత్వమే.

చెడు ఆలోచనలు పెట్టుకుని నేరస్తులు రాజకీయాలు చేసి రాష్ట్రానికి భవిష్యత్ లేకుండా చేశారు. దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో జన్మభూమి, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛత కోసం పనిచేశాం. పరిశుభ్రత విషయంలో మన అందరి ఆలోచనలూ మారాలి” అని అన్నారు.

ఇల్లు ఒక్కటే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రూ.573 కోట్లతో స్వచ్ఛాంధ్ర కోసం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశాం. 110 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ల ఏర్పాటుకు రూ.510 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కంపోస్ట్ తయారీ కోసం డస్ట్ బిన్లను కూడా ఇస్తున్నాం.

పట్టణ ప్రాంతాల్లో లక్షల మెట్రిక్ టన్నుల చెత్త
గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఈ-ఆటోలు, ట్రై సైకిళ్లు, పుష్ కార్డులను ఇచ్చామని చంద్రబాబు అన్నారు. “గత ప్రభుత్వం లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పట్టణ ప్రాంతాల్లో వదిలేసి వెళ్లిపోయింది. తద్వారా భూమి, భూగర్భ జలాలు, వాయు కాలుష్యం పెరిగిపోయింది.

ఇప్పుడు ఆ వ్యర్థాలన్నీ తొలగించి మళ్లీ శుభ్రమైన పరిస్థితులు తీసుకువస్తున్నాం. 112 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తీసేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ 100 శాతం చెత్త సేకరణ చేపట్టేలా కృషి చేస్తున్నాం. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారు చేసే యూనిట్లు 4 ఉన్నాయి.

రాజమండ్రి, విజయవాడలలోనూ మరో రెండు ఏర్పాటు చేయబోతున్నాం. వీటితో పాటు కాంపోస్టు ఎరువు తయారీ కోసం కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టాం. ప్లాస్టిక్, ఈ-వేస్ట్ ను సేకరించేందుకు 130 స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేశాం. 2026 మార్చి నాటికి 660 స్వచ్ఛ రథాలను రాష్ట్రవ్యాప్తంగా తీసుకువస్తాం” అని తెలిపారు.