గుడివాడలో పోటాపోటీ.. నాని ఇలాకాలో చంద్రబాబు భారీ బహిరంగ సభ.. కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు

పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురువారం టీడీపీ నిర్వహించే రా.. కదలి రా.. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

గుడివాడలో పోటాపోటీ.. నాని ఇలాకాలో చంద్రబాబు భారీ బహిరంగ సభ.. కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు

Chandrababu Vs Kodali Nani in Gudivada

Updated On : January 18, 2024 / 10:02 AM IST

Chandrababu Gudivada Tour : పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురువారం టీడీపీ నిర్వహించే రా.. కదలి రా.. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు, కార్యక్రమాలకోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Also Read : No Confidence Motion : బీఆర్ఎస్‌కు కొత్త టెన్షన్.. ఆ నలుగురు ప్రజాప్రతినిధులకు అవిశ్వాస గండం

మాజీ సీఎం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండటంవల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పించనున్నారు. అది పూర్తికాగానే గుడివాడలో రా.. కదలి రా.. కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

Also Read : Sankranthi Holidays : ఏపీ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. సంక్రాంతి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజులంటే..?

రా.. కదలి రా.. సభ ఏర్పాట్లను టీడీపీ ముఖ్య నేతలంతా దగ్గరుండి పరిశీలించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌తోపాటు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇందులో భాగంగా గుడివాడలో భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి, బ్యానర్లు కట్టారు. కేశినేని నాని సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న తొలి సభ కావడంతో తెలుగు తమ్ముళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుడివాడలో రా.. కదలిరా సభను టీడీపీ తమ బలప్రదర్శనగా భావిస్తుంది. ముదినేపల్లి మార్గంలో బహిరంగ సభా వేదికను సిద్ధం చేసింది. సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని టీడీపీ చూస్తోంది.

Also Read : ఎన్నికల వేళ జనసేనలో చేరికల జోష్.. పార్టీలో చేరనున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణ..!

మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వతహాగా ఎన్టీఆర్‌ అభిమాని అయిన కొడాలి నాని.. ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్‌కు నివాళి అర్పించడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అటు టీడీపీ – ఇటు నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టిన క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో బ్యానర్లను చింపేసి తగులబెట్టారు. ఈ పరిణామాలు ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతా చర్యలు చేపట్టారు.