తిరుమల శ్రీవారి సేవలో రెండ్రోజుల పాటు సీఎం జగన్

సీఎం వైఎస్ జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా పంచెకట్టు, తిరునామంతో వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం సీఎం జగన్, డిప్యూటీ సీఎంలు ఆళ్ల నాని, నారాయణ స్వామి, ధర్మాన కృష్ణ దాస్, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కె.రోజా, మంత్రులు పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, కొడాలి నాని, మేకపాటి గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చింతల రామ చంద్రారెడ్డి, బియ్యపు మధు సూధన్ రెడ్డి, కొలుసు పార్థ సారథి, శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.
పద్మావతి అతిథి గృహానికి సీఎం:
తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్ను, డైరీని ఆయన ఆవిష్కరించిన సీఎం జగన్.. శ్రీవారి దర్శనం అనంతరం శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి అక్కడే ఉండి తర్వాతి రోజు ఉదయం 6 గంటల 15నిమిషాలకు పద్మావతి అతిథి గృహం నుంచి బయల్దేరి.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్పతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు.
కర్ణాటక రాష్ట్ర ఛారిటీస్ సత్రాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుమల నుంచి 9.20 గంటలకు బయలుదేరి 10.20 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకుని గన్నవరం ఎయిర్పోర్ట్ ద్వారా రిటర్న్ అవుతారు.