Pawan Kalyan: స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబుపై పవన్ ప్రశంసలు.. ఉన్నతాధికారులకు హితబోధ
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకున్నాను.. ఎందుకంటే.. ప్రజల కలలు, వాటిని సాకారం చేసే నాయకుడు చంద్రబాబు తప్ప నాకు ఎవరూ కనిపించలేదు.

Deputy CM Pawan Kalyan
Swarna Andhra-2047 Vision document: సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృపథంలో నడిపించేందుకు మేమంతా ఆయన వెంటే ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. ‘పది సూత్రాలు.. ఒక విజన్’ పేరిట డాక్యుమెంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. జాతికి, రాష్ట్ర ప్రజలకు ఇది అంకితమని రాసి సంతకం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 2047 విజన్ అంటే ఇప్పుడు హాస్యాస్పదంగా ఉండొచ్చు.. కానీ, 2047 నాటికి ఆ ఫలాలను అందుబాటులోకి వచ్చినప్పుడు దాని విలువ అర్థమవుతుందని పవన్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజన్ 2020 అని ప్రారంభించారు. అప్పట్లో మేమంతా మాదాపూర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రైనింగ్ కోసం వెళ్లి కొండలు చూడటానికి వెళ్లేవాళ్లం. కానీ, చంద్రబాబు నాయుడు అప్పట్లోనే అక్కడ సైబర్ సిటీని చూశారని పవన్ కల్యాణ్ కొనియాడారు. 2020 విజన్ అంటే అప్పట్లో కొందరు అపహాస్యం చేశారు. కానీ, ఇప్పుడు వాళ్లే అక్కడ స్థలాలు కొనుక్కొని, బిల్డింగ్స్ కట్టుకున్నారు. వాళ్లకు ఉపాధి అయిపోయిందని పవన్ అన్నారు.
Also Read: Allu Arjun arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనక చంద్రబాబు హస్తం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకున్నాను.. ఎందుకంటే.. ప్రజల కలలు, వాటిని సాకారం చేసే నాయకుడు చంద్రబాబు తప్ప నాకు ఎవరూ కనిపించలేదు. చంద్రబాబు లాంటి అనుభవం కలిగిన నాయకత్వం చాలా అవసరమని పవన్ అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ అంటే.. మనకున్న ఖనిజాలు, నీటి వనరులు, సహజ వనరులు ఇలా.. వీటిని మానవ వనరులకు అనుసంధానంచేసి ఎలా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనేదే విజన్ డాక్యుమెంట్.. దాని ద్వారా మన భవిష్యత్తు బలంగా ఉంటుందని పవన్ అన్నారు. కులం, పార్టీలు, వర్గాలు పరంగా కొట్టుకునే రోజులు అయిపోయాయి.. సమస్యలు ఉన్నప్పటికీ సరిచేసుకుందాం. మేమంతా ఒకటే మాటపై ఉన్నాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు మేమంతా కలిసి ముందుకెళ్తున్నామని పవన్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కల వికసిత్ భారత్. దానిలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బలోపేతంగా ఉండాలి.. ఆయనకు మా సహకారం అన్నివిధాల ఉంటుందని పవన్ చెప్పారు.
ఉన్నతాధికారులకు పవన్ కళ్యాణ్ హితబోధ..
ఉన్నతాధికారులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హితబోధ చేశారు. గత ఐదేళ్లలో ఒక్క ఉన్నతాధికారి అయినా గట్టిగా చెప్పిఉంటే ఈనాడు ఇన్ని వారసత్వ సమస్యలు వచ్చి ఉండేవి కాదు. ఎంతో అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను సమర్ధవంతంగా అమలు చేయండి. ముఖ్యమంత్రి రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదేనని పవన్ సూచించారు. దయచేసి గత ప్రభుత్వంలోలా భయపడుతూ రాజీపడొద్దు.. ప్రజలు కూడా తమ శక్తిని తాము తెలుసుకుని ఎన్నికల్లో గట్టితీర్పు చెప్పారు. ప్రజా భాగస్వామ్యంతోనే అధికారులతో గట్టిగా పనిచేయించగలం. ఎన్నికలప్పుడు కనబరిచిన బాధ్యతను ప్రజలు కొనసాగించాలని పవన్ కోరారు.