Pawan Kalyan : పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. జగన్పై సెటైర్లు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

deputy cm pawan kalyan
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు పెద్ద మనస్సుతో నన్ను గెలిపించారు. పిఠాపురం ప్రజలకు నేను ఋణపడి ఉంటానని అన్నారు. భవిష్యత్తులో పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజక వర్గంగా మార్చి చూపిస్తానని, రాష్ట్రంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఏరియా డెవలప్మెంట్ చేసేందుకు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేస్తానన్న పవన్.. త్రాగు నీరు, పారిశుధ్యంపై దృష్టి పెట్టామన్నారు. అభివృద్ధి చేసేందుకు జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పవన్ సూచించారు.
Also Read: Srikanth Kidambi : సీఎం చంద్రబాబును కలిసిన కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్యతో..
పిఠాపురంలో దూడల సంత సరైన సౌకర్యాలు లేవని, కోటి ముప్పై లక్షల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు టెండరు పిలవడం జరిగిందని అన్నారు. టీటీడీ కల్యాణ మండపం అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేస్తున్నామని, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ను అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రారంభించానని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల సమయంలో బయటకు రావడం లేదని అన్నారు.. బయటకు వచ్చి బుగ్గలు రుమలడం కాదు.. సమస్యలను తీర్చాలంటూ సెటైర్ వేశారు. ఇసుకకు సంబంధించి ఒక సమస్య ఉంది. సొంత ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేలు కావచ్చు. లేక అధికారులకు కావచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ చెబుతున్నారు. కొంతమంది నాయకులకు ఇసుక ఒక ఆదాయ వనరుగా మారింది. ప్రతిఒక్కరికి ఇసుక ఉచితంగా అందాలి. ఇసుకను సొంత ఇంటి అవసరాలకు కాకుండా ఏ అవసరాలకు వాడినా వారిపై కేసులు ఉంటాయి. అధికారులు ఇసుక విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడితే సస్పెండ్ చేయండని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని పవన్ అన్నారు.
గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వాసులకు నేను మాటిచ్చినట్లు నాలుగు కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం ప్రారంభించామన్నారు. వన్నెపూడి గ్రామం వాసులకు శాశ్వత స్మశాన వాటికకు నిర్మించేందుకు సిద్ధం చేశామని, గొల్లప్రోలు నగరంలో అసంపూర్తిగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను పూర్తి చేసేందుకు కార్యక్రమం చేపట్టామని పవన్ అన్నారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి సంస్థ ను ఏర్పాటు చేస్తానని, 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తానని పవన్ అన్నారు.