Byreddy Siddharth Reddy : కర్నూలులో సంచలనం.. బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదు
Byreddy Siddharth Reddy : వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్థ రెడ్డిపై కేసు నమోదయ్యింది.
due to minister tg bharath complaint case filed against ycp leader byreddy siddharth reddy at kurnool
Byreddy Siddharth Reddy : కర్నూలు జిల్లాలో సంచలనం చోటు చేసుకుంది. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ.భరత్ గుప్తా కేసు నమోదయ్యింది. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థపై కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్.. బైరెడ్డిపై క్రిమినల్, పరువునష్టం దావా వేశారు. త్వరలోనే బైరెడ్డిపై సివిల్ పరువునష్టం దావా కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు.
టీజీ. భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. త్రీ టౌన్ పోలీసులు 351(2), 352, 353(2), 356(1), 356(2) BNS సెక్షన్ల కింద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మే 14న కర్నూలు కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించిన వైసీపీ ధర్నాలో భాగంగా బైరెడ్డి చేసిన ఆరోపణలపై టీజీ భరత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యలు చేయడాన్ని భరత్ తప్పుపట్టారు.
తనతో పాటు తన కుటుంబ సభ్యులపైన కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అవమానకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యం, నిరాధారమైనవని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో తనపై ద్వేషాన్ని సృష్టించేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని మంత్రి టీజీ భరత్ గుప్తా ఆరోపించారు.
