నెల్లూరు మేయర్‌‌కు పదవీ గండం..! గద్దె దింపేందుకు కోటంరెడ్డి పక్కా వ్యూహం.!

మున్సిపల్‌ మంత్రిగా నెల్లూరుకే చెందిన నారాయణ ఉండటంతో తను అనుకున్నది సాధిస్తానని అంటున్నారట కోటంరెడ్డి. ఇక తన చుట్టూ ఉచ్చు బిగిస్తుండటంతో మేయర్‌ కూడా కోటంరెడ్డిని ప్రసన్నం చేసుకోడానికి చూస్తున్నారని అంటున్నారు.

Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరును క్లీన్‌స్వీప్‌ చేసిన టీడీపీ… ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్‌పై ఫోకస్‌ చేసిందట… ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉన్న ఈ కార్పొరేషన్‌లో ఇప్పటికే సగం మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా, మిగిలిన వారు నేడో రేపో పసుపు కండువాలు కప్పుకోవడం ఖాయం అంటున్నారు. మరోవైపు మేయర్‌ స్రవంతి కూడా టీడీపీ గూటికి వచ్చేందుకు తహతహలాడుతుంటే.. ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రేకులు వేస్తున్నారని చెబుతున్నారు… మేయర్‌ వచ్చినా రాకున్నా నెల్లూరులో టీడీపీ జెండా ఎగరేసే దిశగా అడుగులు పడుతుండటంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

వైసీపీ అడ్రస్‌ గల్లంతు చేసేలా అడుగులు..
హాట్‌ పాలిటిక్స్‌కు వేదికైన నెల్లూరులో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు ఫ్యాన్‌ పార్టీకి తిరుగులేని జిల్లాగా చెప్పే నెల్లూరులో సీన్‌ ఒక్కసారిగా రివర్స్‌ అయింది. సైకిల్‌ స్పీడ్‌ పెరగడంతోపాటు వైసీపీ అడ్రస్‌ గల్లంతు చేసేలా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దూకుడుతో కార్పొరేషన్‌పై టీడీపీ జెండా ఎగరేసేలా రంగం సిద్ధమవుతోందంటున్నారు.

టీడీపీలోకి భారీగా వలస వచ్చిన వైసీపీ కార్పొరేటర్లు..
నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 56 డివిజన్లు ఉన్నాయి. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా, 56 డివిజన్లలో ప్రస్తుతం 29 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి సిటీలో 56 డివిజన్లను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా, అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఆ తర్వాత టీడీపీలోకి భారీగా వలస వచ్చారు కార్పొరేటర్లు. డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తోపాటు మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరినా మేయర్‌ మాత్రం వైసీపీలో ఉండటంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్‌ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలో ఉన్నట్లు చెబుతున్నారు.

మేయర్‌ను గద్దె దింపేలా కోటంరెడ్డి స్కెచ్‌…
నెల్లూరులో హవా చూపుతున్న టీడీపీ… కార్పొరేషన్‌ నుంచి వైసీపీని ఖాళీ చేయాలని కొద్ది రోజులుగా పావులు కదుపుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కనుసన్నల్లో మొత్తం స్కెచ్‌ సిద్ధమవుతోన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత మేయర్‌ స్రవంతి గతంలో కోటంరెడ్డికి ముఖ్య అనుచరురాలు. ఎన్నికల ముందు కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా, ఆయన వెంటే మేయర్‌ స్రవంతి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, ఎన్నికల ముందు వైసీపీ నేత ఆదాల ప్రభాకర్‌రెడ్డి చొరవతో మళ్లీ సొంతగూటికి వెళ్లిపోయారు.

ఇక ఎన్నికల సమయంలో మేయర్‌ స్రవంతి భర్త జయవర్ధన్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మాటల తూటాలు పేల్చారు. దీంతో ఎన్నికల అనంతరం మేయర్‌ను గద్దె దింపేలా కోటంరెడ్డి స్కెచ్‌ రెడీ చేశారు. ఇదే సమయంలో ఫోర్జరీ సంతకాల కేసులో మేయర్‌ భర్త జయవర్ధన్‌ అడ్డంగా దొరికిపోవడంతో కోటంరెడ్డికి సరైన అస్త్రం దొరికినట్లైంది. దీంతో కార్పొరేషన్‌ను కైవసం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు కోటంరెడ్డి.

రాజీనామా లేదంటే సెలవు..
స్థానిక సంస్థల చట్టం ప్రకారం మేయర్‌ రాజీనామా చేస్తే కొత్తగా ఎన్నిక నిర్వహించవచ్చు. కానీ, అవిశ్వాసం పెట్టి మేయర్‌ను దింపేయాలంటే నాలుగేళ్లు వేచిచూడాలి. కార్పొరేషన్‌కు ఎన్నిక జరిగి మూడేళ్లు కావడంతో ఇంకా ఏడాది వేచిచూడక తప్పని పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్లాన్‌ బీ అమలు చేయలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్జరీ సంతకాల కేసులో మేయర్‌ భర్త దొరికిపోవడంతో మేయర్‌తో రాజీనామా చేయించాలని.. లేదంటే సెలవుపై పంపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కుదరని పక్షంలో అవిశ్వాసం గడువును మూడేళ్లకు తగ్గించేలా ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం.

కోటంరెడ్డి తండ్రి లాంటి వారని చెబుతున్న మేయర్‌..
మున్సిపల్‌ మంత్రిగా నెల్లూరుకే చెందిన నారాయణ ఉండటంతో తను అనుకున్నది సాధిస్తానని అంటున్నారట కోటంరెడ్డి. ఇక తన చుట్టూ ఉచ్చు బిగిస్తుండటంతో మేయర్‌ కూడా కోటంరెడ్డిని ప్రసన్నం చేసుకోడానికి చూస్తున్నారని అంటున్నారు. తనకు కోటంరెడ్డి తండ్రి లాంటి వారని చెబుతున్న మేయర్‌.. పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమించరా? అంటూ సెంటిమెంట్‌ పండిస్తున్నారు. ఐతే ఎన్నికల సమయంలో తనను మోసం చేశారనే ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి మేయర్‌ను తప్పించి ఆ స్థానంలో డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు.

Also Read : నడిపించే నాయకులు కావలెను..! వైసీపీకి ఎందుకీ దుస్థితి? జగన్ చేసిన ఆ మార్పులే ముంచాయా?

మేయర్‌కు పదవీ గండం..!
మొత్తానికి కోటంరెడ్డి మార్కు రాజకీయంతో నెల్లూరులో మేయర్‌కు పదవీ గండం తప్పేలా లేదని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఫోర్జరీ కేసులో భర్త అరెస్టు అయి జైలుకు వెళ్లడంతో మేయర్‌ స్రవంతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అటు వైసీపీ నేతల వద్దకు వెళ్లలేక.. తన రాజకీయ గురువు కోటంరెడ్డి ఆగ్రహాన్ని చల్లార్చలేక మల్లాగుల్లాలు పడుతున్నారు మేయర్‌. ఏదిఏమైనా సరే కోటంరెడ్డి వ్యూహంతో నెల్లూరు కార్పొరేషన్‌ కొద్దిరోజుల్లో టీడీపీ అకౌంట్‌లో చేరడం ఖాయమని అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు