AP Local Fight: ఏపీలో లోకల్ వార్..! కూటమి పార్టీల ప్లానింగ్స్ ఏంటి? ఏకగ్రీవాలకు వైసీపీ చెక్ పెట్టగలదా?
వైసీపీపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా కీలక స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉంది.
- స్థానిక పోరుకు రెడీ అవుతున్న పార్టీలు.!
- పంచాయతీ ఎన్నికలకు సిద్ధం..సంసిద్ధం
- వ్యూహాలకు పదును పెడుతున్న చంద్రబాబు
- పట్టు పెంచుకునేందుకు జనసేన, బీజేపీ ప్లాన్స్
- ఏకగ్రీవాలకు బ్రేకులు వేసే పనిలో వైసీపీ
AP Local Fight: యస్. ఇట్స్ టైమ్ టు లోకల్ ఫైట్. గెలిచి నిలవాల్సిందే. పట్టు నిరూపించాల్సిందే. క్లీన్ స్వీప్ చేయాల్సిందే. ఏపీలో స్థానిక పోరుపై ఎవరి లెక్కలు వారికున్నాయ్. ఇంకో నెల రోజుల్లో స్థానిక సమరం స్టార్ట్ కానుండటంతో..పార్టీలు ఇప్పటి నుంచే ఎవరి ఎత్తుల్లో వాళ్లు బిజీగా ఉన్నాయి. కూటమిలో ఆ మూడు పార్టీల ప్లానింగ్స్ ఏంటి? విపక్షంలో ఉన్న వైసీపీ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటేనా? ఏకగ్రీవాలకు చెక్ పెట్టగలదా?
ఏపీ పాలిటిక్స్లో స్థానిక ఎన్నికల హడావుడి హీట్ను పెంచుతోంది. సీఎం చంద్రబాబు..అటు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్..ఇటు వైసీపీ అధినేత జగన్ స్టేట్మెంట్స్తో.. ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ మూమెంటమ్ స్పీడప్ అవుతోంది. ఇంకో ఒకటి, రెండు నెలల్లో లోకల్ ఫైట్కు సర్వం సిద్ధం చేస్తోంది సర్కార్. కలెక్టర్ల సదస్సు, రివ్యూలతో స్టేట్ ఈసీ బిజీ అయిపోయింది. ప్రభుత్వ పరంగానే కాదు ఇటు కూటమి పార్టీలు..విపక్ష వైసీపీ కూడా స్థానిక ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయ్. ఆల్రెడీ మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మరోవైపు స్థానిక ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు. ఏకగ్రీవాలు జరగకుండా చూడాలని నేతలను హెచ్చరించిన ఆయన..అభ్యర్థుల గెలుపు బాధ్యతలు ఎమ్మెల్యే స్థాయి లీడర్లకు అప్పగించారు. గ్రామ స్థాయిలో బలం పెంచుకునే యోచనలో అటు బీజేపీ, ఇటు జనసేన పావులు కదుపుతున్నాయి.
పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు..!
ఇటు పార్టీ అగ్రనేతల కామెంట్స్..మరోవైపు ఎస్ఈసీ డెవలప్మెంట్స్తో..ఏపీలో స్థానిక ఎన్నికల సందడి ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో టీడీపీ ఈ ఎలక్షన్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గెలుచుకున్న స్థానాలను తిరిగి కైవసం చేసుకుని పసుపు జెండా రెపరెపలాడించాలని పట్టుదలతో ఉంది. మహానాడు వేదికపైనా స్థానిక ఎన్నికలపై చర్చ జరిగింది. పార్టీ జెండా మోసిన వారికి పోటీ అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్లాయంటున్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా టికెట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సంకేతాలిచ్చారాయన. ఇక ఇదే సందర్భంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా స్థానిక ఎన్నికలపై గురిపెట్టారు. ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, ప్రతి స్థానంలోనూ పోటీ ఉండేలా అభ్యర్థులను ఇప్పటినుంచే రెడీ చేయాలని లీడర్లకు సూచించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ కాక రేక రేపుతోంది.
100 శాతం స్థానాలను గెలుచుకోవాలని టార్గెట్..
స్థానిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల మధ్యే గట్టి పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో జనసేన, బీజేపీకి సీట్లు కేటాయించిన చోట..పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ భావిస్తోంది. 2021-22లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం స్థానాలను సొంతం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో 100 శాతం స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ యోచిస్తోంది. వైసీపీపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన కూడా కీలక స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉంది. ఆయా జిల్లాల నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కీలకమైన వార్డులు, జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తగ్గేదేలే అన్న ఇండికేషన్ పంపిన జగన్…
మరోవైపు బీజేపీ కూడా తమకు బలం ఉన్నచోట అభ్యర్ధులను పోటీలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఎన్నికలకు దూరంగా ఉండాలా..లేక పోటీ చేయాలా అనే డైలామాలో ఉన్న వైసీపీ ఇక అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. అధికార పక్షంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని భావిస్తున్న ఫ్యాన్ పార్టీ..స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు సర్వం సిద్దం చేస్తోందట. రాష్ట్రస్థాయి కీలక నేతల సమావేశంలో స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు జగన్. ముఖ్యంగా ఏకగ్రీవాలు కాకుండా చూడాలని, అలా జరిగితే నియోజకవర్గ ఇంచార్జ్ల ఫెయిల్యూర్గా భావించాల్సి వస్తుందని ముఖ్యనేతలను హెచ్చరించారు. దీంతో స్థానిక పోరు విషయంలో తగ్గేదేలే అన్న ఇండికేషన్ పంపించారు వైసీపీ అధినేత జగన్.
ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 13 వేల 326 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి న్యాయపరమైన చిక్కుల కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించ లేదు. ఇప్పుడు అన్ని పంచాయతీలకు ఎలక్షన్స్ జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 660 జడ్పీటీసీ స్థానాలు, 10వేల 47కి పైగా ఎంపీటీసీ స్థానాలకు ఎలక్షన్స్ పెట్టనుండటంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతోంది. అలాగే రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన ప్రకారం 920కు వార్డుల సంఖ్య పెరిగింది. 75 మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. వీటన్నింటికీ కూడా రెండు విడతల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఈసీ కసరత్తు చేస్తోంది.
Also Read: మాట జారొద్దు, లైన్ దాటొద్దు.. దూకుడుగా వెళ్తున్న నేతలకు కేటీఆర్ క్లాస్?
