జగన్ ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్: సచివాలయంకు పసుపు రంగులు

  • Published By: vamsi ,Published On : October 12, 2019 / 06:44 AM IST
జగన్ ప్లేస్‌లో జూనియర్ ఎన్టీఆర్: సచివాలయంకు పసుపు రంగులు

Updated On : October 12, 2019 / 6:44 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకుని వచ్చిన గ్రామ సచివాలయాలకు రంగులు మార్చుకుంటున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగును ప్రభుత్వం వేయిస్తుండగా.. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగానే స్పందిస్తున్నారు.

ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఏంటీ? అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో గ్రామ సచివాలయానికి పసుపు రంగులు వేశారు తెలుగుదేశం కార్యకర్తలు. దుందిరాలపాడు గ్రామంలో సచివాలయానికి తెలుపు, ఆకుపచ్చ, బులుగు రంగులు వేయడంతో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు ఆ భవనానికి పసుపు రంగు వేశారు.

అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ ఫోటో పెట్టిన ప్లేస్‌లో ఆ ఫోటో తీసేసి సినిమా నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను పెట్టారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..  17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటం స్థానంలో సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని పెట్టడం నేరం అని చెబుతూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.