Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేశ్తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని నారా లోకేశ్, విష్ణుకుమార్రాజు, టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి నాగబాబు నామపత్రాలను సమర్పించారు.
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో నారా లోకేశ్తో పాటు నాదెండ్ల మనోహర్ జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బీజీపీ నుంచి విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. నాగబాబుకు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడింది. అలాగే, శాసన మండలి మంగళవారానికి వాయిదా పడింది.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది.
ఈ భేటీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
నాగబాబుకు ఎమ్మెల్సీ పదవికి బదులు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తారని కూడా ఇటీవల ప్రచారం జరిగింది. రాజ్యసభ ఎంపీగా పంపుతారని కూడా అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. నాగబాబును చివరకు అధికారికంగా జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇవాళ ఆయన నామినేషన్ దాఖలు చేశారు.