AE Nukaraju Family Case : ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నిందితుడు?
AE Nukaraju Family Case : కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Nukaraju Family Case
AE Nukaraju Family Case : కాకినాడ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నూకరాజు, ఆయన సతీమణి, కుమార్తె సామూహిక ఆత్మహత్యకు కారణమైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం.
నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో రాసిన లేఖ ఆధారంగా నిందితుడు సాధిక్ ఖాన్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతనికోసం అప్పటి నుంచి పది మంది ఎస్ఐలుసహా 40మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా.. ఐదు రోజులుగా నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే, ప్రస్తుతం పోలీసులకు సాధిక్ ఖాన్ దొరికినట్లు సమాచారం. కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఢిల్లీలో చేపట్టిన తనిఖీల్లో సాధిక్ పట్టుబడినట్లు తెలిసింది. అతడిని ఆదివారం ఉదయంకు కాకినాడకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య ఘటనలో సాధిక్ ఖాన్ కీలక నిందితుడిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు రాసిన సూసైడ్ లెటర్లో తమ కుటుంబ విషాదానికి సాధిక్ కారణమని పేర్కొన్నాడు. అదేవిధంగా నూకరాజు కుమార్తె సౌజన్య రాసిన మరో లేఖలో కూడా సాదిక్ వల్లే తన భర్త జగదీష్ రెడ్డి మృతి చెందినట్లు పేర్కొంది. ఈ రెండు లేఖలను ఆధారంగా చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
సూసైడ్ నోట్లలో వచ్చిన ఆరోపణల ఆధారంగా రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్తోపాటు సర్పవరం పోలీస్ స్టేషన్లోనూ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, సాదిక్ ఖాన్ పాత్ర, బాధిత కుటుంబంతో అతడికి ఉన్న సంబంధాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడుగా భావిస్తున్న సాధిక్ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అతన్ని ఆదివారం ఏపీకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత జరిపే విచారణలో సాధిక్ నుంచి కీలక విషయాలను పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
