Mega DSC: గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ, ఉద్యోగాల నియామకంపై చంద్రబాబు కీలక ప్రకటన

స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తానని ప్రకటించారు.

Mega DSC: గుడ్‌న్యూస్‌.. మెగా డీఎస్సీ, ఉద్యోగాల నియామకంపై చంద్రబాబు కీలక ప్రకటన

Updated On : April 1, 2025 / 3:06 PM IST

మెగా డీఎస్సీపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక విషయాన్ని తెలిపారు. ఏప్రిల్‌లోనే మెగా డీఎస్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని అన్నారు. జూన్‌లోపు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తానని ప్రకటించారు.

బాపట్ల జిల్లాలోని కొత్త గొల్లపాలెంలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ప్రోగ్రాంలో పాల్గొని మాట్లాడారు. మే నెలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని బాధ్యతగా తీసుకుని ఆ మేరకు పనిచేస్తున్నానని అన్నారు.

Also Read: టీడీపీ జనసేన పొత్తు బలమైనదని ఇలా చాటిచెబుతున్న పవన్ కల్యాణ్

ఇప్పటికే తాము పెంచిన పింఛన్లను అమలు చేస్తున్నామని చంద్రబాబు నాయడు తెలిపారు. రాష్ట్రంలో దివ్యాంగులకు 6 వేల రూపాయల చొప్పున పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ఏపీ సర్కారు పెన్షన్ల కోసం సంవత్సరానికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు.

ప్రతి నెల రూ.2,722 కోట్ల అవుతుందని చంద్రబాబు నాయుడు వివరించారు. తాము ఏపీలో అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే ఆదాయం వస్తుందని, దీంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవచ్చని చెప్పారు. 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేసి నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు.

విశాఖ ఉక్కును గత ప్రభుత్వం దివాలా తీయించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఇప్పుడు గాడిలో పడిందని అన్నారు. ఇది పాలన అంటే అని వ్యాఖ్యానించారు. ప్రజలు సహకరిస్తే రాష్ట్రంలోనీ రహదారులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు.