Rain Alert : ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు.. ఈదురుగాలులతో.. హెచ్చరికలు జారీ..
Rain Alert : ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వేసవి కాలం ఎండలు దంచికొడుతుండగా.. మరోవైపు సాయంత్రం వేళల్లో అకాల వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Rain Alert
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- రాష్ట్రంలో విభిన్న వాతావరణం
- పగలు ఎండలు.. సాయంత్రం వర్షం
- రెండ్రోజులు ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు
Rain Alert : ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు వేసవి కాలం ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎండలు మండిపోతున్నాయి. అయితే, సాయంత్రం సమయాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, తాజాగా.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది. ఇవాళ ఏపీలో ఒకవైపు ఎండలు, మరో వైపు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండల తీవ్రతతో.. సాయంత్రం వేళ అకాల వర్షాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో తీవ్ర వేడి గాలులు, 49 మండలాల్లో వేడి గాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఎండలతోపాటు సాయంత్రం వేళల్లో పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ద్రోణి ప్రభావం కారణంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఏపీలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం నెల్లూరు జిల్లాలోని గూడురు ప్రాంతంలో అత్యధికంగా 45.8డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పల్లాడు జిల్లా పిడుగురాళ్లలో, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలోనూ 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 216 మండలాల్లో 41డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడాన్ని బట్టిచూస్తే రాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు.
ఎండల తీవ్రతతోపాటు అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తలు నిర్వహణ సంస్థ సూచించింది. ప్రస్తుతం రైతుల పంటలు కోత దశలో ఉన్నాయి. వరి, మొక్కజొన్న, మిరప పంటలతోపాటు పలు రకాల పంటల ఉత్పత్తులు కోత దశలో ఉండా.. కొన్ని ప్రాంతాల్లో పంటల ఉత్పత్తులు కల్లాల్లోకి చేరాయి. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయాల్లో రైతులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు ఉన్న ప్రాంతాల్లో వేచి ఉండొద్దని సూచించారు. అంతేకాదు ఎండ తీవ్రత, ఉక్కపోత అధికంగా ఉందని.. అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం వేళ అవసరం లేకుండా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు.
