Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వర్షాలు.. హెచ్చరికలు జారీ
Rain Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వారం రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, ఎండలతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
AP Rain Alert
- ఏపీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు
- వారం రోజులపాటు ఇదే పరిస్థితి
- ఇవాళ, రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్
Rain Alert : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. గత నాలుగు రోజులు నుంచి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 నుంచి 48డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతోపాటు వేడిగాలులు ప్రభావంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం సైతం రాష్ట్రంలో48డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉంటుందని, అయితే, పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
Also Read : Gold silver Price Today : బంగారం ధరల్లో భారీగా మార్పు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..
రాష్ట్రంలో సోమవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లాల్లో 48డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. శ్రీకాకుళం జిల్లాలో 47డిగ్రీలు, రాజమహేంద్రవరం జిల్లాలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఎండల తీవ్రత వచ్చే వారం రోజులు ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మంగళవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మర్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 46డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 నుంచి 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అదేవిధంగా.. శ్రీకాకుళం, విశాఖపట్టణం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాలులు ప్రభావం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 26మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలో ఎండలతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వర్షాలకుతోడు భారీస్థాయిలో ఈదురుగాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు, ఈదురుగాలులు సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పెద్దపెద్ద హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
